వేర్వేరుగానే ప్రవేశ పరీక్షలు!

వేర్వేరుగానే ప్రవేశ పరీక్షలు! - Sakshi


ఒకటిగా సాంకేతిక, కళాశాల విద్య

 సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగానే ఎంసెట్, ఐసెట్, ఈసెట్, పాలీసెట్ తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రవేశ పరీక్షల నిర్వహణ, ప్రవేశాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు. వచ్చే ఏడాది మాత్రం ఎక్కడి ప్రవేశ పరీక్షలు అక్కడే నిర్వహించాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. పదేళ్లపాటు ప్రస్తుతం ఉన్న విద్యా, ప్రవేశాల విధానామే ఉండాలని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ ఎలాగన్న అంశాలపైనా కసరత్తు చేస్తున్నారు.

 

  పదేళ్లపాటు ప్రస్తుతం ఉన్న విధానమే అమలు చేయాల్సి ఉన్నందున.. తెలంగాణలోని విద్యాసంస్థల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సీట్లు కావాలనుకుంటే తెలంగాణ విద్యాశాఖ నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాసంస్థల్లో తెలంగాణ విద్యార్థులకు ప్రవేశాలు కావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్ష రాయాల్సి ఉంటుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అయితే దీనిపై రెండు ప్రభుత్వాలు చర్చించాల్సి ఉంద ని తెలిపారు.

 

 ఉన్నత విద్యామండలి సహా రాష్ట్ర స్థాయి వర్సిటీల విభజన

 రాష్ట్ర విభజనలో భాగంగా ఉన్నత విద్యామండలిని కూడా విభజించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పదో షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ మండలి, అందులో పని చేస్తున్న వారి విభజనకు సిద్ధం చేయాలని ప్రభుత్వం సూచించింది. దీంతో అధికారులు మండలి విభజనకు సంబంధించిన చర్యలు చేపట్టారు. రాష్ట్రస్థాయి యూనివర్సిటీలను కూడా విభజించే ఏర్పాట్లు చేయాలని పేర్కొనడంతో అధికారులు వాటిపైనా దృష్టి సారించారు.

 

 పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, జవహార్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ, ద్రవిడ విశ్వవిద్యాలయాలను విభజించే ందుకు కసరత్తు చేస్తున్నారు. ఏఎఫ్‌ఆర్‌సీ మాత్రం ఏడాది పాటు రెండు రాష్ట్రాలకు సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మరోవైపు సాంకేతిక విద్యా శాఖ, కళాశాల విద్యా శాఖలను విలీనం చేయాలని నిర్ణయించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top