కార్పొరేట్ భాషగా ఇంగ్లిష్


తణుకు టౌన్, న్యూస్‌లైన్ : ఇంగ్లిష్ కార్పొరేట్ భాషగా మారిపోయిందని, ఇందుకు తగ్గట్టుగా విద్యాబోధన ఉండాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ అకడమిక్ డీన్ కె.శ్రీరమేష్ అన్నారు. తణుకు ఎస్సీఐఎం డిగ్రీ కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించే ‘స్కిల్ అప్‌డేట్ అండ్ రీట్రైనింగ్ ఆఫ్ స్పీకింగ్ అండ్ రైటింగ్ ఇంగ్లిష్’ అంశంపై డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సెమినార్ శుక్రవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా శ్రీరమేష్ మాట్లాడుతూ స్థానిక భాషల ప్రభావాన్ని తగ్గించుకోవడం ద్వారా ఇంగ్లిష్‌లో రాణించవచ్చన్నారు.

 

  జాతీయ స్థాయిలో ఉత్తర,ప్రత్యుత్తరాలు జరపడంలో రాష్ట్ర అధ్యాపకులు వెనుకబడి ఉన్నారనే ఉద్దేశంతో ఈ సెమినార్ ఏర్పాటుచేశామని చెప్పారు. ఇది విజయవంతమైతే జాతీయస్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఉన్నత విద్యాసంస్థలలో ఇంగ్లిష్ విద్యాబోదనపై కాకినాడ పీఆర్ డిగ్రీ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ ఎంవీ భరతలక్ష్మి, ఇంగ్లిష్ వ్యాకరణం, నియమాలపై ఎ.రజనీకాంత్, ఇంగ్లిష్ మాట్లాడటంలో సమస్యలపై కాకినాడ పీఆర్ కళాశాల అధ్యాపకుడు ఏవీ నరసింహారావు ప్రసంగించారు. ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కేవీ రమణమూర్తి, సెమినార్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం.శ్యాంబాబు, వర్క్‌షాపు డెరైక్టర్ ఏ రజనీకాంత్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రభుత్వ, ఎయిడెట్ డిగ్రీ కళాశాలలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు. పలు అంశాలను శ్రీరమేష్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.

 

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top