ఉపాధి పేరుతో ఘరానా మోసం | Employment opportunities in rural areas | Sakshi
Sakshi News home page

ఉపాధి పేరుతో ఘరానా మోసం

Sep 21 2013 4:01 AM | Updated on Jun 4 2019 5:02 PM

గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఓ బోగస్ సంస్థ ఘరాన మోసం చేసేందుకు పథకం రచిం చింది.

వనపర్తి, న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఓ బోగస్ సంస్థ ఘరాన మోసం చేసేందుకు పథకం రచిం చింది. కంపోస్టు ఎరువుల తయారీలో ప్రత్యేక శిక్షణనిచ్చి సొంత గ్రామంలోనే మూడేళ్ల పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ నెలకు రూ. 5వేల వేతనం చెల్లిస్తామని ఓ సంస్థ రాష్ట్రంలోని పలువురి సర్పంచ్‌లకు నెల రోజుల క్రితం ఉత్తరాలు పంపింది. కొత్తగా గెలిచిన సర్పంచ్‌లు ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో గ్రామానికి చెందిన ముగ్గురు చొప్పున రూ.500ల డీడీలు తీసి, ఆ సంస్థ సూచించిన అడ్రస్‌కు పోస్టులో పంపించారు. అయితే సదరు సంస్థ బోగస్ అని తేలడంతో సర్పంచ్‌లు తెల్లమోహం వేశారు.
 
 సంస్థ ఉత్తరం అందుకున్న వనపర్తి మండలం మెంటేపల్లి సర్పంచ్ పురుషోత్తమరెడ్డి పలువురు సర్పంచ్‌లతో వెళ్లి ఆ సంస్థ ఇచ్చిన అడ్రాస్‌లో విచారణ చేయగా, అది బోగస్ అని తేలినట్లు వారు వాపోయారు.  శుక్రవారం సర్పంచ్ పురుషోత్తమరెడ్డి ఇందుకు సంబంధించిన పలు వివరాలు విలేకరులకు వెల్లడించారు. ‘అ గ్రి ఫామింగ్ ఎండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ పేర నెల రోజుల క్రితం అన్ని గ్రామాల సర్పంచ్‌లకు ఓ ఉత్తరం వచ్చింది. అందులో ప్రతి గ్రామం నుంచి ఎస్సెస్సీ పాస్ లేదా ఫెయిల్ అయిన ముగ్గురు నిరుద్యోగులను సర్పంచ్‌లు ఎంపిక చేసి కంపోస్టు ఎరువుల తయారీలో శిక్షణనిచ్చేందుకు పంపాలని ఆ సంస్థ సూచించింది. చాలా మంది సర్పంచ్‌లు తమ గ్రామానికి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో యువత చేత డీడీలు తీయించి పంపించారు. అయితే తనకు అనుమానం వచ్చి ఆ సంస్థ ఇచ్చిన అడ్రస్‌ను హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో వెతికి పట్టుకున్నాం.

అయితే ఆ సంస్థను గత నెల 13వ తేదీనే రిజిస్ట్రేషన్ చేయించి, ఓ చిన్న గదిని అద్దెకు తీసుకుని బోగస్ సంస్థను సృష్టిచారని తమ విచారణలో తెలుసుకున్నాం’ అని పేర్కొన్నారు. అసలు ఆ సంస్థకు కంపోస్టు ఎరువుల తయారీపై శిక్షణనిచ్చే సామర్థ్యం లేదని ఆయన చెప్పారు. రాష్ట్రం నుంచి వేలాది మంది ఇప్పటికే డీడీలు పంపించారని, మరో వారం పది రోజుల్లో సంస్థ బోర్డు తిప్పే పరిస్థితి ఉన్నట్లు తేలిందన్నారు. సర్పంచ్‌లను పావులుగా చేసి నిరుద్యోగులను మోసం చేస్తున్న ఈ బోగస్ సంస్థ తీరుపై సర్పంచులందరీతో కలిసి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement