ఏపీలో ఐదు కేంద్రాల్లో రీపోలింగ్..! | EC Seforus For Repoling For Five Polling Stations In AP To CEC | Sakshi
Sakshi News home page

ఏపీలో ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌కు సిఫారసు

Apr 17 2019 7:23 PM | Updated on Apr 17 2019 7:43 PM

EC Seforus For Repoling For Five Polling Stations In AP To CEC - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలు పంపారు. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో రెండేసి చొప్పున.. ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్‌కు స్థానిక కలెక్టర్లు ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేదికి నివేదికలు పంపారు. ఆయన వాటిని పరిశీలించిన అనంతరం ఐదు చోట్ల రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు. జిల్లా కలెక్టర్ల నివేదిక మేరకు ఈవీఎంల్లో లోపాలు తలెత్తిన ఐదు కేంద్రాలను గుర్తించిన.. సీఈసీకి పంపారు.

నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 94వ పోలింగ్‌, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో ఉన్న 244వ పోలింగ్‌ కేంద్రం, నెల్లూరు అసెంబ్లీ పరిధిలోని ఇసుకపల్లిలో గల 41వ పోలింగ్‌ కేంద్రం, సూళ్లురుపేట నియోజకవర్గంలోని అటకానితిప్పలోని 197వ కేంద్రం, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని 247వ పోలింగ్‌ కేంద్రాలలో రీపోలింగ్‌ నిర్వహించాలని సీఈసీకి సిఫారసు చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం వెలువరించాల్సి ఉంది.

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 12మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని ద్వివేది ఈసీని కోరారు. జిల్లా కలెక్టర్ల నుంచి పూర్తి నివేదికలు వస్తే మరికొంతమందిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. కాగా ఈనెల 11న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించిన కారణంగా రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్లు వినిపిస్తోన్న నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement