నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ | Eamcet counseling starts to day | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్

Aug 7 2014 1:12 AM | Updated on Sep 2 2017 11:28 AM

ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ఎట్టకేలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇంజనీరింగ్‌లో చేరికకు నేటి నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.

నూనెపల్లె/కర్నూలు రూరల్: ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ఎట్టకేలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇంజనీరింగ్‌లో చేరికకు నేటి నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ప్రక్రియ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, కౌన్సెలింగ్ కన్వీనర్ ఎం.రామసుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని రాయలసీమ యూనివర్సిటీ, బి.తాండ్రపాడులోని పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌన్సెలింగ్ చేపడతామన్నారు.
 
 ఆర్‌యూ ప్రొఫెసర్ సంజీవరావు కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారని.. గురువారం ప్రారంభం కానున్న కౌన్సెలింగ్ 23వ తేదీతో ముగుస్తుందన్నారు. ఆగస్టు 15న సెలవు దినంగా ప్రకటించినట్లు చెప్పారు. నంద్యాలలో ఎస్సీ, ఓసీ, బీసీ అభ్యర్థులకు, కర్నూలులో ఎస్టీలతో పాటు ఇతర కేటగిరీల అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. ఎస్సీ,ఎస్టీలు రూ.300, ఓసీ, బీసీలు రూ.600 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. వికలాంగులు, సీఏపీ, ఎన్‌సీసీ, ఆర్మీ, గేమ్స్(సెంట్రలైజ్డ్ విభాగం) కేటగిరీల అభ్యర్థులకు 7 నుండి 18వ తేదీ వరకు హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంకు సమీపంలో ఉన్న సాంకేతిక విద్యా భవనంలో సర్టిఫికెట్ల పరిశీలన, రిజిస్ట్రేషన్ చేపడతారన్నారు. ఇదిలాఉండగా ఆప్షన్లపై ఇప్పటి వరకు షెడ్యూల్ విడుదల కాకపోవడం కొంత ఆందోళనకు కారణమవుతోంది.      

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement