ధరలమోతతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు.
చుక్కల్లో నిత్యావసర వస్తువులు కొండెక్కిన కూరగాయలు
లబోదిబోమంటున్న పేద, మధ్యతరగతి వర్గాలు
ధరలమోతతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. కాయగూరలు పేద వర్గాలకు అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి. కనీసం వెయ్యి రూపాయలు వెచ్చిస్తే.. కానీ వారానికి సరిపడా సరుకులు రావడం లేదని జనం వాపోతున్నారు. ఇక పప్పులు, నూనెల ధరలైతే ఉద్యోగస్తులకు సైతం చుక్కలు చూపిస్తున్నాయి. ధరల దెబ్బకు చప్పిడన్నం.. నీళ్ల సాంబారే గతిగా మారుతోందని జనం వాపోతున్నారు.
చిత్తూరు: జిల్లావాసులకు మార్కెట్ భయం పట్టుకుంటోంది. వందలు రూపాయలు వెచ్చిస్తున్నా.. పూటగడవడం కష్టంగా మారుతోందని వినియోగదారులు బెం బేలెత్తిపోతున్నారు. కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని సగటుజీవి ఆవేదన చెందుతున్నాడు. ముఖ్యంగా కందిపప్పు సామాన్యుడి ఇంట్లోకి రానంటోంది. కిలో రూ. 145 వరకు పలుకుతోంది. టమాటా మాటంటేనే భయపడుతున్నాడు. మిర్చిఘాటుకు దాని దగ్గరికి వెళ్లాంటేనే భయపడిపోతున్నాడు. బెండకాయ నుంచి కాకరకాయ వరకు అన్ని కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మేమేం తక్కువ లేమంటూ ఆకు కూరలు కూడా మధ్యతరగతి ప్రజలను భయపెడుతున్నాయి. వారం క్రితం రూ. 5లకే కట్ట వచ్చిన ఆకుకూరలు ఇప్పుడు రూ.10 పలుకుతున్నాయి. నింగినంటుతున్న కూరగాయల ధరలను కిందికి దించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఘాటెక్కిస్తున్న మిర్చి..
మిర్చి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. నెల క్రితం రూ. 20 ఉన్న ధర ఒకానొక దశలో రూ. 80 పలికింది. ఇప్పుడు కొంచెం శాంతించి రూ.50 దగ్గర స్థిరపడింది. టమాటా ధర నెల క్రితంతో పోలిస్తే సుమారు ఎనిమిది రెట్లు పెరిగింది. నెల రోజుల క్రితం రూ.10 పలికింది. ఇక బెండకాయ, కాకర, క్యాబేజీ, క్యారెట్ , దోస వంటి కాయగూరలు రూ.40కు తగ్గడం లేదు. నాణ్యమైన కందిపప్పు కిలో సుమారు రూ.145 పలుకుతోంది. దీంతో ‘ఇంట్లో పప్పు వండు అని భార్యకు చెప్పలేకున్నామ’ని కూరగాయలు కొనడాకి వచ్చిన ఓ చిరుద్యోగి వాపోయాడు. కిలో ఉద్దిపప్పు ధర రూ.175కు తగ్గడం లేదు. ఇడ్లీ, దోసె చేసుకోవాలంటే పండుగలకు చూద్దాంలే.. అని గృహిణులు నిట్టూరుస్తున్నారు.
అమ్మో మార్కెట్..
పెరిగిన ధరల ప్రభావం రోజువారీ వినియోగంపై పడింది. ఏదో కొద్డిపాటి సరుకులు కొని పూట గడుపుకుంటున్నాడు. అర,పావు కిలో కొని సరిపెట్టుకుంటున్నారు. మారిన వాతావరణ పరిస్థితుల వల్ల కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ తినాలని డాక్టర్లు చెబుతున్నప్పటికీ ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో వినియోగాన్ని తగ్గించుకుంటున్నాడు.
వినియోగం తగ్గింది..
గతంతో పోలిస్తే ప్రజలు కొనుగోలు తక్కువ చేస్తున్నారు. ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలే కాదు వ్యాపారులు కూడా నష్టపోతున్నారు. గతంలో కిలో కూరగాయలు కొనేవారు ప్రస్తుతం అర కేజీ కొనడాకి కూడా భయపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు.- జీఆర్ మోహన్, కూరగాయల వ్యాపారి, చిత్తూరు
మార్కెట్కు రావాంలంటేనే భయంగా ఉంది
కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.మార్కెట్కు రావాలంటేనే భయంగా ఉంది. కూరగాయల ధరలను ప్రభుత్వం నియంత్రించాలి. సామాన్యుడికి అందుబాటులో ఉంటే ఎక్కువ కొనుగోలు చేస్తాడు.- పుష్పలత, ఉద్యోగిని