అతివేగం ప్రాణం తీసింది

Driver Died in Lorry Accident - Sakshi

ఎదురెదురుగా వచ్చి లారీలు ఢీ

డ్రైవర్‌ మృతి, మరో డ్రైవర్‌కు గాయాలు

గొల్లపల్లి, మీర్జాపురం గ్రామాల మధ్య ఘటన

నూజివీడు: అతివేగం ఒకరి ప్రాణాలు బలిగొనగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.  ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒక లారీ డ్రైవర్‌ మృతిచెందగా, రెండో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని గొల్లపల్లి, మీర్జాపురం గ్రామాల మధ్య శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి జగ్గయ్యపేటకు నేలబొగ్గు లోడుతో వెళ్తున్న లారీ, కొండపల్లి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలనుకు రోడ్డు మెటీరియల్‌తో వెళ్తున్న టిప్పరు తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీల ముందరి భాగం దెబ్బతినగా జగ్గయ్యపేట వెళ్తున్న లారీ డ్రైవర్‌ జడ వీరబాబు (36) అక్కడికక్కడే మృతిచెందాడు. టిప్పర్‌ డ్రైవర్‌ ముత్తు సురేష్‌ (32)కు గాయాలయ్యాయి. బాధితుడిని 108 వాహనంలో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడిది జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామం. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌  ఇంకొల్లు సుబ్బారావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top