ఏపీలో ప్రారంభమైన దేశీయ విమాన సర్వీసులు

Domestic Flight Services Resume In Andhra Pradesh - Sakshi

సాక్షి, విజయవాడ/విశాఖపట్నం : రెండు నెలల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం ఉదయం నుంచి  దేశీయ విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. గన్నవరం, విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ల నుంచి రాకపోకలు ప్రారంభం కావడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరకుంటున్నారు. ఎయిర్‌పోర్ట్‌లకు చేరకున్న ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజేషన్‌ చేసిన తర్వాత అధికారులు లోనికి అనుమతిస్తున్నారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. సిబ్బంది కూడా ప్రత్యేక రక్షణ దుస్తులు ధరించి విధులకు హాజరయ్యారు. గన్నవరం నుంచి బెంగళూరు, ఢిల్లీ, చెన్నైలకు, విశాఖ నుంచి బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌లకు మధ్య విమాన సర్వీసులు నడవనున్నాయి. (చదవండి : 630 విమానాలు రద్దు)

ఇప్పటికే బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు ఒక విమానం చేరకుంది. ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రయాణికులకు అధికారులు ప్రత్యేక బస్సుల్లో తరలిస్తున్నారు. ప్రయాణికులు రెండు గంటల ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ మధుసూదన్‌రావు సూచించారు. మరోవైపు ఇండిగో విమానంలో బెంగళూరు నుంచి విశాఖకు 114 మంది ప్రయాణికులు చేరుకున్నారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక కేంద్రాలకు తీసుకెళ్లి స్క్రీనింగ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. స్వాబ్‌ కలెక్షన్‌ తర్వాత వారిని హోం క్వారంటైన్‌కు తరలించనున్నారు. కాగా, దేశంలోని పలు ఎయిర్‌పోర్ట్‌లలో సోమవారం నుంచే దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top