వివాహం ఇష్టం లేక... | Do not want to get married | Sakshi
Sakshi News home page

వివాహం ఇష్టం లేక...

Jul 6 2015 4:36 AM | Updated on Sep 3 2017 4:57 AM

చదువుపై మమకారంతో తల్లిదండ్రులు బలవంతంగా చేసిన వివాహాన్ని కాదని 16 ఏళ్ల యువతి ఆదివారం ఒంగోలుకు చేరుకుంది.

♦ ఇంటి నుంచి ఒంగోలు చేరుకున్న యువతి
♦ చైల్డ్‌లైన్ చొరవతో బాలసదన్‌కు
 
 ఒంగోలు క్రైం : చదువుపై మమకారంతో తల్లిదండ్రులు బలవంతంగా చేసిన వివాహాన్ని కాదని 16 ఏళ్ల యువతి ఆదివారం ఒంగోలుకు చేరుకుంది. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న ఆ బాలికను గమనించిన చైల్డ్‌లైన్-1098 ప్రతినిధి బి.వి.సాగర్ ఆ బాలిక వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ఆ బాలికది కనిగిరి మండలం రామాపురం. ప్రస్తుతం గుంటూరులోని ఏటుకూరు రోడ్డులో ఆ బాలిక కుటుంబం ఉంటోంది. ఆ బాలిక నాన్న ముఠా పని చేసుకుంటూ కాపురాన్ని నెట్టుకొస్తున్నాడు. గత నెల 5వ తేదీ ఆ బాలికను మేనమామ జి. వెంకట్రావుకు ఇచ్చి వివాహం చేశారు.

అయితే ఆ వివాహం ఇష్టం లేని ఆమె అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో ఘర్షణ పడుతూనే వచ్చింది. చివరకు చేసేది లేక ఇంటి నుంచి తాను చదువుకున్న సర్టిఫికెట్లన్నీ తీసుకొని గుంటూరు నుంచి ఒంగోలుకు చేరుకుంది. బాలిక ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసింది. ఆ పరీక్షల్లో 8.9/10 గ్రేడ్ పాయింట్లు వచ్చాయి. చదువుతో పాటు ఎన్‌సీసీలో కూడా బాగా రాణించింది. ఎవరైనా ఆదరించి చదివిస్తే చదువుకుంటానంటూ ఆ బాలిక  ఆశగా వేడుకుంటోంది. బాలల సంక్షేమ కమిటీ ఆదేశాల మేరకు ఆ బాలికను బాలసదన్‌లో చేర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement