దందా సంఘాలు.. | Danda unions .. | Sakshi
Sakshi News home page

దందా సంఘాలు..

Nov 30 2014 2:02 AM | Updated on Nov 9 2018 4:31 PM

దందా సంఘాలు.. - Sakshi

దందా సంఘాలు..

విద్యార్థుల సమస్యల పరిష్కరించేందుకు ఏర్పాటైన విద్యార్థిసంఘాలు కొన్ని హద్దుమీరుతున్నాయి. కాలం చెల్లినా, బోగస్ విద్యార్థి సంఘాల ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి.

నెల్లూరు(విద్య): విద్యార్థుల సమస్యల పరిష్కరించేందుకు ఏర్పాటైన విద్యార్థిసంఘాలు కొన్ని హద్దుమీరుతున్నాయి. కాలం చెల్లినా, బోగస్ విద్యార్థి సంఘాల ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. ఎవరికి వాళ్లు ఇష్టారీతిన విద్యార్థి సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. జేఏసీ అంటూ అందరూ కలసి ఏళ్ల తరబడి విద్యార్థిసంఘ నాయకులుగా వ్యవహరిస్తూ దందాలు చేస్తున్నారు.

ఏ కళాశాలలోనూ విద్యనభ్యసించకుండా విద్యార్థి నాయకులుగా చలామణి అవుతున్నారు. సమస్యలను సృష్టించి ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు గుంజడమే వారి ధ్యేయంగా మారుతోంది. అసలు లక్ష్యాన్ని విడిచిన సంఘాల కారణంగా విద్యాసంస్థల యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నారు.

గతంలో జిల్లాలో ప్రముఖ రాజకీయ పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్ జిల్లా అధినేతలు తమ పార్టీ విద్యార్థి సంఘ నాయకుల ఆగడాలను తట్టుకోలేక వారిని ఆ పదవుల నుంచి తొలగించిన సందర్భాలున్నాయి. ఇలా బయటికొచ్చిన వారు నాయకులుగా సొంత సంఘాలను స్థాపించి జేఏసీలుగా అవతారాలు ఎత్తుతున్నారు. అటు ప్రైవేటు విద్యాసంస్థలను బెదిరిస్తూ ఇటు ప్రభుత్వ అధికారులను నానా ఇబ్బందులు పెడుతున్నారు.

నాయకుడు పేరుతో ఒకరు నలుగురు యువకులను వెంటేసుకొని కూడళ్లలో ధర్నాలు నిర్వహించడం దిష్టిబొమ్మలను దహనం చేయడం వీరి దందాలో భాగమైపోతుంది. కౌన్సెలింగ్, పరీక్షల సమయాల్లో వీరి ఆగడాలకు అడ్డు లేకుండా పోతుంది.

జిల్లాలో గుర్తింపు పొందిన విద్యార్థి సంఘాలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. వాళ్లు తమ పని తాము చేసుకుంటున్నారు. ఒక విద్యార్థి సంఘం నుంచి వెలివేయబడి సొంతగా విద్యార్థి సంఘాలను జేఏసీలను ఏర్పాటు చేసుకున్న వారితోనే సమస్యలు అధికమవుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కార్యాలయం, లెటర్‌హెడ్ లేకుండానే వీరి దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు. వారి మీద చర్యలు తీసుకోవాలంటే ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న విద్యార్థిసంఘాలను సైతం వీరు తప్పుదోవ పట్టించిన సందర్భాలు జిల్లాలో అనేకం.

 ప్రోత్సహిస్తున్న విద్యాసంస్థలు...
 విద్యాసంస్థల మధ్య నెలకొన్న అనారోగ్య పోటీ నకిలీ సంఘాల నాయకులను ప్రోత్సహిస్తుంది. కొన్ని విద్యార్థి సంఘాలను కొన్ని విద్యాసంస్థలు దత్తత తీసుకొని ప్రత్యర్థి విద్యార్థి సంస్థలపైకి ఉసిగొల్పుతున్నారు. దీంతో రెచ్చిపోయిన విద్యార్థి నాయకులు విద్యాసంస్థల మధ్య తగాదాలను పెంచి పోషిస్తున్నారు.

నిబంధనల పేరుతో విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తున్నామనే ముసుగులో తమను ప్రోత్సహిస్తున్న వారికి దండుగా నిలుస్తున్నారు. దీంతో అధికారులు అటు విద్యాసంస్థలపై, ఇటు గుర్తింపులేని, దందాలు చేస్తున్న కొన్ని విద్యార్థి సంఘాలపై చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బోగస్ విద్యార్థి సంఘాల ఆగడాలకు అడ్డుకట్టవేయాల్సి అవసరం ఉంది.

 బోగస్ లీలలు కొన్ని..
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సందర్భంలో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన ఏపీఓ వద్ద విద్యార్థి నాయకుడు ల్యాప్‌టాప్ లాక్కొని అతనిపై దాడి చేశాడు.

బీఈడీ కౌన్సెలింగ్ నేపథ్యంలో వెంకటేశ్వరపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద రెండు విద్యార్థి సంఘాల మధ్య వాగ్వివాదం, తోపులాటలు జరిగాయి. పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
ఓ కార్పొరేట్ స్కూల్ తమ బెదిరింపులకు లొంగలేదని ఆ పాఠశాలకు చెందిన వ్యాన్ అద్దాలను పగలగొట్టడం నగరంలో చర్చనీయాంశమైంది.

వీఎస్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ సందర్భంలో వీఎస్‌యూ విద్యార్థి సంఘం నాయకులపై విద్యార్థి సంఘ నాయకులమని చెప్పుకొనే కొందరు దాడిచేసి గాయపరిచారు. కేసు నడుస్తోంది.

తాజాగా ప్రైవేటు కళాశాల యాజమాన్యాలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, ఆర్‌ఐఓ విధులకు అంతరాయం కలిగిస్తున్నారని ఆర్‌ఐఓనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోగస్ విద్యార్థి సంఘాల ఆగడాలు అనేకం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement