బంగాళాఖాతంలో ఏర్పడ్డ హెలెన్ తుఫాన్ తీర ప్రజల్ని వణికిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 18 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోయారు.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ హెలెన్ తుఫాన్ తీర ప్రజల్ని వణికిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 18 మంది మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోయారు. రెండు బోట్లలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు అలల ఉధృతికి తీరానికి చేరుకోలేకపోయారు. వీరిని రక్షించేందుకు కోస్ట్ గార్డ్, మెరైన్ సిబ్బంది రంగంలోకి దిగారు.
హెలెన్ తుఫాన్ మచిలీపట్నానికి 250 కిలో మీటర్ల దూరంలో కదులుతోంది. దిశ మార్చుకుంటూ కదులుతోంది. రేపు సాయంత్రం తీరం దాటే అవకాశముంది. తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉంది. నెల్లూరు జిల్లాలో సముద్రం 30 అడుగులు ముందుకుచొచ్చుకుని వచ్చింది. అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఈ తుఫాను వల్ల ఆంధ్రప్రదేశ్లోని తీరప్రాంత జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా పూరిళ్లు, గుడిసెలు ఎక్కువగా ధ్వంసం అవుతాయని తెలిపింది. చెట్లు విరిగి పడటం వల్ల విద్యుత్తు, కమ్యూనికేషన్ లైన్లకు కూడా నష్టం కలుగుతుందని హెచ్చరించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.