కరోనా: వచ్చే నెల 4 వరకు పెనుగొండ సీల్‌  | Coronavirus: Official Says Penugonda Red Zone Area Sealed To May 4th | Sakshi
Sakshi News home page

కరోనా: వచ్చే నెల 4 వరకు పెనుగొండ సీల్‌ 

Apr 10 2020 10:51 AM | Updated on Apr 10 2020 10:51 AM

Coronavirus: Official Says Penugonda Red Zone Area Sealed To May 4th - Sakshi

పెనుగొండలో డేంజర్‌ జోన్‌ ప్రాంతం  

సాక్షి, పెనుగొండ: కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో పెనుగొండను వచ్చేనెల 4వ తేదీ వరకు సీల్‌ చేయాలని అధికారులు నిర్ణయించారు. గురువారం ఆర్డీఓ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. కరోనా రెండో దశకు చేరడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే విపరీత పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావించారు. ఇందుకు అనుగుణంగా పెనుగొండ పరిసర ప్రాంతాలను మూడు జోన్లుగా విభజించారు. కరోనా సోకిన ప్రాంతం నుంచి 820 మీటర్ల రేడియస్‌ను డేంజర్‌ జోన్‌గా, మూడు కిలోమీటర్ల రేడియస్‌ను రెడ్‌ జోన్‌గా, 5 కిలోమీటర్ల రేడియస్‌ను ఆరంజ్‌ బఫర్‌ జోన్లుగా విభజించారు.

డేంజర్‌ జోన్‌లో ఎటువంటి కదలికలు ఉండకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలను వలంటీర్ల ద్వారా ఆ ప్రాంతంలో ఇళ్లకే అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. రెడ్‌ జోన్, ఆరంజ్‌ బఫర్‌ జోన్లలో నిత్యం ఆరోగ్య సర్వే చేయించాలని ఆదేశించారు. డేంజర్‌ జోన్‌లో ఉన్న సుమారు 200 మంది శ్యాంపిల్స్‌ సేకరించి కరోనా పరీక్షలకు పంపించారు. ఆయా రిపోర్టులు వచ్చినా వచ్చేనెల 4 వరకు ఆ ప్రాంతంలో ప్రజలంతా స్వీయ నిర్బంధంలోనే ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో పెనుగొండ మొత్తం హైఅలర్ట్‌ ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement