మనమే ముందు నిర్వహిద్దాం! | Congress Leaders planning for public meetings before ysrcp `samaikyandhra Sankharavam`meeting | Sakshi
Sakshi News home page

మనమే ముందు నిర్వహిద్దాం!

Oct 2 2013 2:00 AM | Updated on May 25 2018 9:10 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర శంఖారావం సభ నిర్వహించడానికి ముందే సీమాంధ్రలో జిల్లాల వారీగా భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్‌ నేతలు కసరత్తు చేస్తున్నారు.

వైఎస్సార్‌సీపీ సమైక్య శంఖారావం కన్నా ముందే సీమాంధ్ర జిల్లాల్లో కాంగ్రెస్‌ సభలు...  గంటా నివాసంలో శైలజానాథ్‌, లగడపాటి భేటీ

 సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హైదరాబాద్‌లో సమైక్యాంధ్ర శంఖారావం సభ నిర్వహించడానికి ముందే సీమాంధ్రలో జిల్లాల వారీగా భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్‌ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇదే అంశంపై చర్చించేందుకు గంటా శ్రీనివాసరావు నివాసంలో మంగళవారం సమైక్యాంధ్ర కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్‌ ఎస్‌.శైలజానాథ్‌, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సమావేశమయ్యారు.

 

సీమాంధ్రలో గత రెండు నెలలుగా జీతాల్లేకుండా ఏపీఎన్జీవోలు సమ్మెను కొనసాగిస్తున్నారని, వారిలో నైతిక సై్థర్యం దెబ్బతినకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడమెలా? అన్న విషయంపై వారు చర్చించారు. అదే సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తనవైపు తిప్పుకునేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హైదరాబాద్‌లో సభ నిర్వహించేందుకు సిద్ధమవుతోందని, అందువల్ల ఆ పార్టీ కంటే ముందే జిల్లాల వారీగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున బహిరంగ సభలు నిర్వహిస్తే మంచిదన్న భావనకు వారు వచ్చారు. ఏ జిల్లాలో ఎప్పుడు సభ నిర్వహించాలనే అంశంపై ఈనెల 3న హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఉన్న క్లబ్‌హౌస్‌లో నిర్వహించే సీమాంధ్ర కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధుల సమావేశంలో కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement