రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన జీఓఎంకు సమర్పించే నివేదికపై సీపీఐ కసరత్తు ప్రారంభించింది. నివేదికలో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించేందుకు మంగళవారమిక్కడ పార్టీ రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది.
విభజనపై కాంగ్రెస్ తీరును శంకించిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన జీఓఎంకు సమర్పించే నివేదికపై సీపీఐ కసరత్తు ప్రారంభించింది. నివేదికలో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించేందుకు మంగళవారమిక్కడ పార్టీ రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. మహబూబ్నగర్ జిల్లా పార్టీ నాయకుడు ఈర్ల నరసింహ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శులు, సీనియర్ నేతలు హాజరయ్యారు. రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. సీమాంధ్రుల ఉద్యమాన్ని ప్రశంసిస్తూనే తెలంగాణ ఏర్పాటు ఖాయమన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
అయినా, కాంగ్రెస్ పార్టీని నమ్మలేమని, 2014 ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ సమస్యను లాగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న అనుమానాన్నీ వ్యక్తంచేశారు. మూడు ప్రాంతాలకు చెందిన జిల్లాల కార్యదర్శులు తమ నివేదికల్ని అందజేశారు. రాయలసీమ నేతలు తమ ప్రాంత వెనుకబాటును దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్యాకేజీ కావాలని కోరారు. కర్నూలు కేంద్రంగా రాజధాని ఉండాలని సూచించారు. భద్రాచలం, అశ్వారావుపేట ప్రాంతాలను సీమాంధ్రలో కలిపితే పోలవరం ప్రాజెక్టుకు చిక్కులు రాకుండా ఉంటాయని కోస్తా జిల్లాల నేతలు అభిప్రాయపడ్డారు. పార్టీకి రెండు కమిటీలు ఏర్పాటుచేయాలని సీమాంధ్ర నేతలు కోరినప్పటికీ రాష్ట్ర నాయకత్వం తోసిపుచ్చింది.