
సాక్షి, గుంటూరు : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వంతో పాటు అదరూ కలిసి రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. అడవుల సంఖ్య ఏటేటా తగ్గిపోతుందని, వీటిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం జగన్ గుంటూరు జిల్లా డోకిపర్రు గ్రామంలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులలతో కలిసి మొక్కలు నాటారు. ‘చెట్లవల్లే జనం, జీవం. మనం చెట్లను కాపాడితే, అవి ధరిత్రిని రక్షిస్తాయి. వన మహోత్సవం సందర్భంగా మొక్కలను విరివిగా నాటుదాం, వాటిని పెంచే బాధ్యతను తీసుకొందాం, కొత్తవనాల్ని సృష్టిద్దాం. అనూహ్య వాతావరణ మార్పులనుంచి మానవాళిని, జీవజాతులను సంరక్షించుకుందాం’అని సీఎం ట్విటర్లో పేర్కొన్నారు.