ఊరెళ్లడానికి బయలుదేరిన తల్లి వెంట అమ్మా అమ్మా అంటూ వచ్చిన చిన్నారి హఠాత్తుగా బస్సుకింద పడి నలిగిపోయింది.
పాతపట్నం: ఊరెళ్లడానికి బయలుదేరిన తల్లి వెంట అమ్మా అమ్మా అంటూ వచ్చిన చిన్నారి హఠాత్తుగా బస్సుకింద పడి నలిగిపోయింది. అప్పటికే బస్సు ఎక్కిన ఆ కన్నతల్లితోపాటు డ్రైవర్ కూడా ఆ చిన్నారి రాకను గమనించకపోవడంతో ఘోరం జరిగిపోయింది. మండలంలోని తెంబూరు గ్రామం వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అరుణోదయ ప్రయివేట్ బస్సు కింద పడి ఆదే గ్రామానికి చెందిన తృను కృష్ణారావు, తులసీ మొదటి సంతానమైన తృను రేష్మ(3) మృతి చెందింది.
పర్లాకిమిడి నుంచి తెంబూరు మీదుగా టెక్కలి వెళ్తున్న అరుణోదయ ప్రయివేట్ బస్సు తెంబూరు కండ్రవీధి ఆగగా, రేష్మ తల్లి తులసి వారి కన్న వారింటికి టెక్కలి వెళ్లడానికి బయలుదేరింది. రోడ్డు ఇంటికి దగ్గరగా ఉండడంతో పాప పరుగెత్తి వచ్చింది. తల్లి బస్సు ఎక్కుతుండగా వెనుక నుంచి అమ్మా అమ్మా అంటూ.. ఏడ్చుకుంటూ వచ్చింది. అలా ఏడ్చుకుంటూ పరుగున వచ్చిన రేష్మ బస్సు కింద పడిపోయినా డ్రైవర్ కూడా గమనించకపోవడంతో చక్రాల కింద నలిచి విగతజీవిగా మారింది. కృష్ణారావు, తులసీలకు ఇద్దరు కుమార్తెలు కాగా, అందులో పెద్దమ్మాయి రేష్మ. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తండ్రి కృష్ణారావు ఫిర్యాదు మేరకు హెచ్సీ నర్సింగరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.