రాజంపేట మండలం ఎంజీపురం పరిసర ప్రాంతాల్లో ఓ దున్నపోతు స్వైరవిహారం చేస్తోంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ గ్రామస్తులకు మాత్రం నిద్రహారాలు లేకుండా చేస్తోంది.
రాజంపేట, న్యూస్లైన్ : రాజంపేట మండలం ఎంజీపురం పరిసర ప్రాంతాల్లో ఓ దున్నపోతు స్వైరవిహారం చేస్తోంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ గ్రామస్తులకు మాత్రం నిద్రహారాలు లేకుండా చేస్తోంది. కొందరైతే దున్నపోతు దేవుడికి ఇచ్చారని చెపుకుంటున్నారు. నాలుగు రోజులుగా దున్నపోతు పేరు వింటేనే గ్రామస్తులు హడలెత్తిపోతున్నారు. అది కనిపిస్తే ఉరుకులు..పరుగులు తీస్తున్నారు. రాత్రిళ్లు సమీప తోటల్లో మకాం వేసి, సాయంత్రం కాగానే ఊరిపై పడటం ఏమిటోనని ఆందోళన చెందుతున్నారు.
రెండ్రోజు కిందట దున్నపోతు దాడి నుంచి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చిన్న పెంచలయ్య చెట్టెక్కి తప్పించుకోగా, అదే రోజున అదే గ్రామానికి చెందిన కామాక్షమ్మపై దున్నపోతు దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. దీంతో ఆమెను తిరుపతి రుయాలో చేర్పించారు. ఆమె పరిస్ధితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. దున్నపోతు వ్యవహారంపై మాజీ సర్పంచ్ చిన్నపెంచలయ్య, రాయలసీమ ప్రజాసమితి అధ్యక్షుడు కెఎంఎల్ నరసింహులు కలసి రాజంపేట రూరల్ సీఐ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్ర జూ డెరైక్టర్ దృష్టికి..
దున్నపోతును పట్టుకొనే విషయాన్ని సీఐ వెంకటేశ్వర్లు రాష్ర్ట జూ విభాగం డెరైక్టరు మల్లికార్జున దృష్టికి ఫోన్లో తీసుకెళ్లారు. ఆయన ఖమ్మంజిల్లాలో కూడా ఓ దున్నపోతు కనిపించి జనంపై దాడి చేసిన సంఘటన గుర్తు చేసుకున్నారు. దీంతో తిరుపతి జూ అధికారులు డాక్టర్ అరుణ్, రేంజర్ సెల్వకుమార్ ఇక్కడికి చేరుకన్నురు. దున్నపోతుకు మత్తు ఇచ్చి అదుపులోకి తీసుకునేందుకు సీఐతో కలసి గాలించారు. బాగా పొద్దు పోయినంత వరకు దున్నపోతు కోసం గాలించారు. అది కన్పించకపోవడంతో చేసేది లేక జూ అధికారులు వెనుదిరిగారు. దున్నపోతు కన్పిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని గ్రామస్తులను కోరారు.