బావ చేతిలో మరిది హత్య | Brother-in-law's murder at the hands | Sakshi
Sakshi News home page

బావ చేతిలో మరిది హత్య

Dec 1 2014 1:05 AM | Updated on Sep 2 2017 5:24 PM

బావ చేతిలో మరిది హత్యకు గురైన సంఘటన శనివారం రాత్రి మండలంలోని గబ్బంగి పంచాయతీ ....

పరారీలో నిందితుడు
 
పాడేరు రూరల్ : బావ చేతిలో మరిది హత్యకు గురైన సంఘటన శనివారం రాత్రి మండలంలోని గబ్బంగి పంచాయతీ పనసపల్లిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలివి. జి.మాడుగుల మండలం సింగర్భ గ్రామానికి చెందిన కిల్లో చిట్టిబాబు మూడేళ్ల క్రితం పనసపల్లికి వలస వచ్చాడు. అరకులోయ మండలం సుంకరిమెట్టకు చెందిన పాంగి తిరుపతి కూడా ఇక్కడికి పదిహేనేళ్ల క్రితం వలసవచ్చి పశువులు కాస్తూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్నాడు. తిరుపతి చిన్నాన్న కూతురు పార్వతిని కిల్లో చిట్టిబాబుకు ఇచ్చి వివాహం చేశారు. దీంతో చిట్టిబాబు కుటుంబం కూడా పనసపల్లిలోనే నివాసం ఉంటోంది. ఇదిలావుండగా, వరుసకు సోదరి అయిన పార్వతికి, తిరుపతికి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం కొన్నాళ్లుగా చిట్టిబాబును వెంటాడుతోంది. ఈ విషయంపై వీరిద్దరూ తరచూ తగాదా పడేవారు.

దీంతో తిరుపతిని హతమార్చాలని శనివారం ఉదయం నుం కత్తి పట్టుకుని చిట్టిబాబు గ్రామంలో తిరిగాడు. ఈ తెలుసుకున్న తిరుపతి తన ప్రాణానికి ప్రమాదం ఉందని భావించి పూటుగా మద్యం సేవించి రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న చిట్టిబాబుపై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన చిట్టిబాబు కొద్ది సేపటికే మృతి చెందాడు. అతడి భార్య పార్వతి ఫిర్యాదు మేరకు సీఐ ఎన్.సాయి, ఎస్‌ఐ ధనుంజయ్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement