
ఇసుకే బంగారమాయె!
ఇసుకను ప్రభుత్వం బంగారంగా మార్చేస్తోంది. నిర్మాణదారులను దోపిడీ చేసి ఖజానా నింపుకోవాలని చూస్తోంది.
దర్మవరం : ఇసుకను ప్రభుత్వం బంగారంగా మార్చేస్తోంది. నిర్మాణదారులను దోపిడీ చేసి ఖజానా నింపుకోవాలని చూస్తోంది. రీచుల నుంచి ఇసుక రవాణాకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులు అటు సామాన్య వినియోగదారులను, ఇటు ఇసుక రవాణాపైనే ఆధారపడిన వాహనదారులను షాక్కు గురి చేస్తున్నాయి. ఈ ఉత్తర్వులు అమల్లోకి రావడంతో ఇసుక రీచ్లలో అమ్మకాలు, రవాణా దాదాపు నిలిచిపోయాయి.
సొంత వాహనాలు చెల్లవు
కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం రీచుల నుంచి ఇసుకను తరలించేందుకు వినియోగదారులు ఇంతకు ముందులా సొంత లేదా తమకు నచ్చిన వాహనాలను అద్దెకు వినియోగించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం వద్ద నమోదైన వాహనాల్లోనే.. అదీ ఇసుక ధరతోపాటు రవాణా ఖర్చులను ముందుగానే చెల్లించి ఇసుకను తీసుకెళ్లాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో ఆదేశించింది. దీంతో జిల్లాలోని అన్ని రీచ్లలో ప్రభుత్వం అనుమంతి పొందిన వాహనాల్లోనే ఇసుకను రవాణా చేస్తున్నారు.
ఇసుక రీచ్ల నిర్వహణను డ్వాక్రా సంఘాలకు కట్టబెట్టిన ప్రభుత్వం ఇప్పుడు రవాణాను కూడా వారికే కట్టబెట్టింది.
ఇసుక రవాణా చేయదలచిన వారు సంబంధిత వెలుగు కార్యాలయాల్లో తమ వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లను నమోదు చేసుకోవాలి.
ఇసుక కొనుగోలుదారుల సొంత వాహనాలతో సహా ఇతరత్రా ఏ వాహనాలను అనుమతించరు.
ఇసుక కావాల్సిన వారు ఇసుక ధరతోపాటు వాహనం బాడుగను ముందుగానే మీ సేవా కేంద్రంలో చెల్లించి రసీదు తీసుకొస్తేనే సంబంధిత రీచ్ల నిర్వహకులు ఇసుక లోడింగ్ అనుమతిస్తారు.
దూరాన్ని బట్టి రవాణా చార్జీలను ప్రభుత్వమే నిర్ణయిందింది. దాని ప్రకారం కిలోమీటర్ దూరానికి ట్రాక్టర్లకైతే రూ.28, లారీలకు రూ. 44 చొప్పున వసూలు చేస్తారు.
కొనుగోలుదారులకు భారం :
ఈ విధానం ఇసుక కొనుగోలు దారులకు భారంగా మారుతోంది. దీనికి తోడు ఇసుక రవాణాను ఉపాధిగా చేసుకున్న వందలాది ట్రాక్టర్లు, లారీల యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటి వరకు ఇసుక రవాణాకు వాహనదారులతో బేరమాడి నచ్చిన చార్జీలు చెల్లించే వెసులు బాటును వినియోగదారుడు కోల్పోయాడు. తాజా ఉత్తర్వుల ప్రకారం తప్పని సరిగా నిర్ణీత ధరను వెచ్చించి వినియోగదారుడు ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి.
ఫలితంగా వినియోగదారుడు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి. ఉదాహరణకు ఒక ట్రాక్టర్ ఇసుకను ధర్మవరం పట్టణ వాసులు తాడిమర్రి వద్దనున్న ఇసుక రీచ్లో కొనుగోలు చేస్తే లోడ్ (మూడు క్యూబిక్ మీటర్లు) రూ. 2025, రవాణా చార్జీలు రూ. 1.000 కలుపుకుని రూ. 3025 లభించేది. కానీ ప్రభుత్వ నూతన విధానం వల్ల రవాణా చార్జీలే రూ.2240 చెల్లించాలి. ఇసుక, రవాణా చార్జీలు, మీసేవా రుసుము రూ.25 కలిపితే రూ.4290 పడుతుంది. అంటే వినియోగదారునిపై రూ.1265 అదనంగా భారం కానుంది.