పుత్తూరులో టీడీపీ అరాచకాలు | Audio confined spreadsheet | Sakshi
Sakshi News home page

పుత్తూరులో టీడీపీ అరాచకాలు

Mar 29 2014 3:55 AM | Updated on May 29 2018 4:06 PM

పుత్తూరులో తెలుగుదేశం నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు తనదైన శైలిలో ప్రత్యర్థి అభ్యర్థులపై దాడికి దిగారు.

పుత్తూరు న్యూస్‌లైన్: పుత్తూరులో తెలుగుదేశం నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు తనదైన శైలిలో ప్రత్యర్థి అభ్యర్థులపై దాడికి దిగారు. మున్సిపల్ ఎన్నికల్లో దూసుకుపోతున్న వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను భయపెట్టే ప్రయత్నాలకు తెరతీశారు. 19వ వార్డులో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న జి.బాబుపై శుక్రవారం అక్రమ కేసు పెట్టించారు. పరోక్షంగా పోలీసులు సహకరించారనే వాదన వినిపిస్తోంది. 19వ వార్డు అభ్యర్థి జి.బాబు 16వ వార్డుకు వెళ్లి వస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆ సమయంలో అతని వద్ద రూ.15 వేలు ఉంది. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం కూడా కాదు. ఏ అభ్యర్థి అయినా రూ.25 వేల వరకు ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఉంచుకోవచ్చని ఎన్నికల నియామావళి ఉంది. ఓటర్లను ప్రలోభపెడుతూ డబ్బు ఇవ్వచూపినప్పడు అరెస్ట్ చేయవచ్చు. అయితే బాబు విషయంలో అరెస్ట్ చేయడానికి ఎలాంటి ఆధారం లేకపోయినా కేవలం ముద్దుకృష్ణమనాయుడు ఆరోపణను ఆధారంగా చేసుకొని పోలీసు అధికారులు అత్యుత్సాహం చూపించారు. ఈ విషయంపై డీఎస్పీ కృష్ణకిషోర్‌రెడ్డి మాట్లాడుతూ 19వ వార్డు అభ్యర్థి రూ.15 వేలు తన వద్ద ఉంచుకుని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే అభియోగంపై అరెస్టు చేసినట్లు వివరించారు.
 
దుకాణానికి నిప్పు
 
జీవనాధారమైన దుకాణానికి తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు నిప్పు పెట్టారని బాధితుడు దావూద్ ఆరోపిస్తున్నారు. పుత్తూరు మున్సిపాల్టీలోని 11వ వార్డు నుంచి డి.విమల అనే స్వతంత్ర అభ్యర్థికి తాను మద్దతు ఇస్తున్నందుకే ఈ దాడి జరిగిందని దా వూద్ ఆరోపిస్తున్నాడు. ముస్లిం మైనారిటీలకు చెం దిన తాను స్వతంత్ర అభ్యర్థికి మద్దతు తెలుపుతుండడంతో గెలుపు కష్టమవుతోందని భావించిన తెలుగుదేశం పార్టీ వారు ఇలా తన పాతసామాన్ల దుకాణానికి నిప్పుపెట్టారని ఆరోపించారు. ఈ అగ్ని ప్రమాదంలో రూ.2 లక్షల విలువైన వస్తువులు కాలిపోయాయని వాపోయారు.
 
టీడీపీ మద్యం స్వాధీనం
 
ఆటోతో సహా 432 క్వార్టర్ బాటిళ్లు ఉన్న 9 బాక్సులను పుత్తూరులో ఎక్సైజ్ శాఖ సీఐ గౌస్ మహమ్మద్ స్వాధీ నం చేసుకున్నారు. నిందితుడు ఆటో డ్రైవర్ సి.మోహన్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. చెర్లోపల్లికి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో బ్రాందీషాపు నుంచి  9 కేసుల మద్యం ఆటోలో తీసుకెళ్తుండగా ఎక్సైజ్‌శాఖ సీఐ తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. అయితే ఈ ఘటనలో మద్యం కొనుగోలు చేసిన వ్యక్తు లు తప్పించుకోగా ఆటో డ్రైవర్ దొరికిపోయాడు. విచారిస్తే తెలుగుదేశం పార్టీకి చెందిన వారు బేరం మాట్లాడి, తాను పట్టుబడిన తర్వాత తప్పుకోవడం దురదృష్టకరమని నిందితుడు ఆవేదనకు లోనయ్యారు.
 
 ఇది అన్యాయం: రోజా

 ఎన్నికల నియమావళి మేరకు రూ.25 వేల వరకు డబ్బు కలిగి ఉండవచ్చనే విషయాన్ని మరచి తెలుగుదేశం నేత ముద్దుకృష్ణమనాయుడు ఇచ్చిన సూచనలతో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థిని అరెస్టు చేయడం అన్యాయమని ఆ పార్టీ నగరి నియోజకవర్గ సమన్వయకర్త ఆర్‌కే రోజా ఖండించారు. ఓడిపోతామన్న భయంతోనే టీడీపీ వారు అడ్డదారులు తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళతామని వైఎస్‌ఆర్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు యుగంధర్‌రెడ్డి తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement