
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వీరిద్దరి రాజీనామాలను అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు బుధవారం ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆదే విధంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల్లో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయని నోటిఫికేషన్ జారీ చేశారు.
ఇక ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణ విజయం సాధించి పెద్దల సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరు మండలి సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఈ మేరకు మండలి చైర్మన్కు బుధవారం తమ రాజీనామా లేఖను పంపించగా ఆయన ఆమోదించారు. రాజ్యసభ ఎన్నికల్లో వీరిద్దరితో పాటు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని ఎన్నికైన విషయం తెలిసిందే.