టాయిలెట్స్ లేకుంటే ఎయిడెడ్ | Aided by without toilets | Sakshi
Sakshi News home page

టాయిలెట్స్ లేకుంటే ఎయిడెడ్

Nov 25 2014 12:38 AM | Updated on Aug 17 2018 6:08 PM

మౌలిక సదుపాయాలు లేకుండానే జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు విద్యాసంస్థలు నడుస్తున్నాయి.

ఏలూరు సిటీ :మౌలిక సదుపాయాలు లేకుండానే జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు విద్యాసంస్థలు నడుస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం తీవ్రంగానే స్పందించేందుకు సిద్ధపడుతోంది. ఎయిడెడ్ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశాలిచ్చారు. తక్షణమే జిల్లాలోని అన్ని ఎయిడెడ్ పాఠశాలల్లో విధిగా మరుగుదొడ్లు నిర్మించి తీరాలనడంతో డీఈవో డి.మధుసూదనరావు అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని ఏయే ఎయిడెడ్ పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నాయి, ఎక్కడ లేవనే అంశంపై ఎంఈవోల నుంచి నివేదికలు రప్పించుకున్నారు. 127 ఎయిడెడ్ స్కూళ్లలో ఇవి లేవని తేలింది. ఆయా పాఠశాలల్లో డిసెంబర్ 1నాటికి వాటిని నిర్మించకపోతే కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు చెబుతున్నారు.
 
 కలెక్టర్‌కు తప్పుడు నివేదిక
 ఎయిడెడ్ పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నాయా.. లేవా అనే అంశంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించిన కలెక్టర్‌కు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తప్పుడు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. 19 ఎయిడెడ్ పాఠశాలల్లో మాత్రమే మరుగుదొడ్లు లేవని వారు చెబుతుండగా, 127 పాఠశాలల్లో లేవని ఎంఈవోల క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. దీనినిబట్టి చూస్తే ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తప్పుడు సమాచారం ఎందుకిచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
 నోటీసులు జారీ
 జిల్లాలో 220 ఎయిడెడ్ విద్యాసంస్థలు ఉండగా, మరుగుదొడ్లు లేని 127 పాఠశాలల్లో డిసెంబర్ 1నాటికి వాటిని నిర్మించాలని ఆదేశిస్తూ ఆయా పాఠశాలల యాజమాన్యాలకు డీఈవో నుంచి ఈనెల 21న నోటీసులు వెళ్లాయి. డిసెంబర్ 2న సంబంధిత పాఠశాలలను ఎంఈవోలు తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటికీ మరుగుదొడ్లు నిర్మించకపోతే తొలుత ఆ పాఠశాలలకు గుర్తింపును రద్దు చేస్తామని విద్యాశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ 5 నాటికీ వాటిని నిర్మించకపోతే సంబంధిత ఎయిడెడ్ పాఠశాలలకు తాళాలు వేస్తారు. దీంతో పాటు రికార్డులను విద్యాశాఖ స్వాధీనం చేసుకుంటుందని, అక్కడ చదువుతున్న పిల్లలను సమీపంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
 
 ఎంఈవో లు గుర్తించిన ప్రకారం ఏలూరు అర్బన్ పరిధిలో 10, ఏలూరు రూరల్‌లో 7 ఎయిడెడ్ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. ఆకివీడు మండలంలో 11, భీమడోలు మండలంలో 11, బుట్టాయగూడెం మండలంలో 2, చింతలపూడి మండలంలో 19, దెందులూరు మండలంలో 7, ద్వారకాతిరుమల మండలంలో 3, జంగారెడ్డిగూడెం మండలంలో 3, కామవరపుకోట మండలంలో 4, కొవ్వూరు మండలంలో 1, కాళ్ల మండలంలో 5, లింగపాలెం మండలంలో 6, నిడమర్రు మండలంలో 2, పెదపాడు మండలంలో 8, పెదవేగి మండలంలో 14, పోలవరం మండలంలో 2, టి.నరసాపురం మండలంలో 4, తాడేపల్లిగూడెం మండలంలో 1, ఉండి మండలంలో 4, ఉంగుటూరు మండలంలో 3 ఎయిడెడ్ పాఠశాలల్లో టాయిలెట్స్ లేవు.
 
 సర్కారు బడుల సంగతేంటి!
 ఎయిడెడ్ పాఠశాలల సంగతి అటుంచితే.. ప్రభుత్వ పాఠశాలల్లోనూ చాలాచోట్ల మరుగుదొడ్ల సౌకర్యం లేదు. ఎయిడెడ్ పాఠశాలల్లో విధిగా మరుగుదొడ్లు ఉండాలని చెబుతున్న అధికారులు ప్రభుత్వ పాఠశాలలను పక్కనపెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో సుమారు 2,700 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, వాటిలో సగానికి పైగా పాఠశాలల్లో టాయిలెట్స్ లేవు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఇవి ఉన్నా మరుగునపడ్డాయి. వాటి నిర్వహణ సైతం భారంగానే ఉంది. ఉన్నత పాఠశాలల్లో సైతం మరుగుదొడ్లు లేవు. వీటిపైనా అధికారులు దృష్టి సారించాలని విద్యారంగానికి చెందిన పలువురు కోరుతున్నారు.
 
 చర్యలు తప్పవు
 మరుగుదొడ్లు లేకుండా పాఠశాలలు నిర్వహించ టం నిబంధనలకు విరుద్ధం. ఈ విధంగా ఎప్పటినుంచో నెట్టుకొస్తున్న ఎయిడెడ్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటాం. సొమ్ములు లేవని, ఇతరత్రా కారణాలు చెప్పినా సహించేది లేదు. డిసెంబర్ 5వ తేదీ అనంతరం మరుగుదొడ్లు నిర్మించకపోతే పోలీస్, రెవెన్యూ అధికారుల సహకారంతో ఆ పాఠశాలలకు తాళాలు వేస్తాం.
 - డి.మధుసూదనరావు, డీఈవో
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement