ఫీజులు ఎగిరిపోయాయ్‌ | School Fee shock in private schools | Sakshi
Sakshi News home page

ఫీజులు ఎగిరిపోయాయ్‌

Jun 12 2026 1:58 AM | Updated on Jun 12 2026 1:58 AM

School Fee shock in private schools

ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల షాక్‌ 

40% వరకు పెంచిన యాజమాన్యాలు 

బుక్స్, యూనిఫాం పేరుతో దోపిడీ 

కార్పొరేట్‌ స్కూళ్లలో రూ. 5 లక్షలపైనే 

సాధారణ స్కూళ్లలోనూ కనీసం రూ. లక్ష ఫీజు

అప్పుల కోసం తల్లిదండ్రుల తిప్పలు

ఖైరతాబాద్‌కు చెందిన మానస తన కూతురును ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో చదివిస్తోంది. ఏఐ పాఠాలు తప్పనిసరి అని యాజమాన్యం చెప్పింది. దీని కోసం రూ.10 వేలు వెచ్చించి గ్యాడ్జెట్‌ కొనాలన్నారు. మార్కెట్లో దీని ఖరీదు రూ.6 వేలు. బయట తీసుకొస్తే కుదరదని చెప్పారు. స్కూల్‌ ల్యాన్‌కు కనెక్ట్‌ అవుతుందని, బయటవి వాడితే వైరస్‌ వస్తుందని చెప్పారని మానస తెలిపింది.  

ఖమ్మంలోని ఓ కార్పొరేట్‌ తరహా స్కూల్‌లో ఎల్‌కేజీ చదివే విద్యార్థికి పది వర్క్‌బుక్స్, 18 నోట్‌ బుక్స్‌ను అంటగట్టారు. దీనికి అక్షరాలా రూ.8 వేలు వసూలు చేశారు. ఇలా ప్రతీ స్కూల్‌లోనూ రకరకాల ఖర్చులతో విద్యార్థుల తల్లిదండ్రులను యాజమాన్యాలు పిండుతున్నాయి.

సాక్షి, హైదరాబాద్‌: జూన్‌ నెల పేరు చెప్పగానే తల్లిదండ్రులు వణికిపోతున్నారు. స్కూళ్ల ఫీజులు, యూనిఫారాలు, రవాణా ఖర్చులు తలుచుకొని వారు భయపడిపోతున్నారు. ఈ నెల 15 నుంచి స్కూళ్లు తెరవనున్న నేపథ్యంలో ప్రైవేట్‌ విద్యా సంస్థలు ఇప్పటికే అడ్మిషన్ల వేగం పెంచాయి. జేఈఈ, నీట్‌ ఫౌండేషన్‌ అంటూ హడావుడి చేస్తున్నాయి. కొత్తగా ప్రాజెక్టు వర్క్‌లంటూ సరికొత్త కార్యక్రమాలను తెరమీదకు తెస్తున్నాయి. వీటికి వాడే మెటీరియల్‌కు కూడా స్కూల్‌ యాజమాన్యాలే డిజైన్‌ చేస్తున్నాయి. మొత్తంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కావాల్సినంత పిండుతున్నాయి.  

అమ్మో అంత ఫీజా! 
గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఫీజులు ఏకంగా 40 శాతం వరకూ పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల ప్రైవేట్‌ పాఠశాలలున్నాయి. టెన్త్‌ వరకూ చదివే విద్యార్థులు రాష్ట్రంలో 24 లక్షల మంది ఉన్నారు. వీరిలో 74 శాతం ప్రైవేట్‌ స్కూళ్లల్లోనే చదువుతున్నారు. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో 60 శాతం మంది విద్యార్థులున్నారు. వీరిలో సగానికిపైగా మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి వారే. నెలకు రూ.30 నుంచి రూ.50 వేల మధ్య వేతనం పొందేవారే ఎక్కువ. ప్రైవేట్‌ స్కూళ్ల ఫీజులు చుక్కలు చూపిస్తున్నాయని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన స్వప్న తెలిపారు. సాధారణ స్కూల్‌లో ఐదోతరగతి చదివే తన కూతురుకు గత ఏడాది రూ.70 వేల వార్షిక ఫీజు చెల్లించింది. ఈ ఏడాది నుంచి రూ.1.10 లక్షలని చెప్పారు. కార్పొరేట్‌ స్కూళ్లల్లో ఏకంగా రూ.2.75 లక్షలున్న ఫీజును రూ.3.50 లక్షలకు పెంచారు. ఒక మోస్తరు స్కూల్‌లో కూడా రూ.లక్ష వరకూ ఫీజు వసూలు చేస్తున్నారు. వేతనాలు పెరిగాయని, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విద్య అందిస్తున్నామని యాజమాన్యాలు అంటున్నాయి. దీనివల్ల లేబొరేటరీ, మౌలిక వసతుల ఖర్చు పెరిగిందని బుకాయిస్తున్నారు. చాలా స్కూళ్లల్లో ఇవేవీ ఉన్నట్టు చూపించేందుకు యాజమాన్యాలు ఇష్టపడటం లేదు.  

రవాణాకు ఆయిల్‌ దెబ్బ 
స్కూల్‌ బస్సు, ఆటో, ఇతర వాహనాల రేట్లు భారీగా పెంచారు. పశ్చిమాసియా సంక్షోభంతో డీజిల్‌ రేట్ల పెరుగుదలను కారణంగా చూపుతున్నారు. కిలోమీటరు దూరానికి కూడా కనీస చార్జీగా నెలకు రూ.15 వేలు అంటున్నారు. గత ఏడాది ఈ ఫీజు రూ.10 వేల వరకూ ఉంది. స్కూల్‌ బస్సుల రేట్లు 30 నుంచి 60 శాతం వరకూ పెంచారు. ఏసీ ఉంటే మరీ ఎక్కువ. రవాణా చార్జీలు ఫీజులను మించి పోతున్నాయని తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఆటోకు పది మంది వరకూ రవాణా చేసేలా బేరం కుదుర్చుకుంటున్నారు. కొన్ని స్కూళ్లు సంవత్సరానికి సరిపడా రవాణా చార్జీలు ముందే వసూలు చేస్తున్నాయి. అవసరం లేని నోటు పుస్తకాలు, స్థాయికి మించిన వర్క్‌బుక్స్‌ తమ దగ్గరే కొనాలని ప్రైవేట్‌ పాఠశాలలు ఒత్తిడి తెస్తున్నట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కొన్ని స్కూళ్లల్లో ఏఐ సంబంధిత పాఠాల కోసం కొన్ని ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లూ అంటగడుతున్నారు. 

కొత్త టెక్నాలజీ పేరుతో ఫీజుల మోత  
ఏఐ లేకుంటే భవిష్యత్‌ లేదని చెప్పారు స్కూల్‌వారు. రెండో తరగతి అమ్మాయికీ అవసరమే అన్నారు. గత ఏడాది రూ.90 వేలు ఫీజు ఉంటే, ఈ ఏడాది ఏకంగా రూ.1.30 లక్షలు కట్టమన్నారు. ఈ విద్య కోసం కొన్ని సాఫ్ట్‌వేర్‌ గ్యాడ్జెట్లు కొనిపించారు. దీనికి రూ.12 వేలు వసూలు చేశారు.  
– రాయభారపు సంధ్య (విద్యార్థి తల్లి, హైదరాబాద్‌) 

స్కూల్‌ బస్సుకు మరీ అంతా  
గత సంవత్సరం స్కూల్‌ బస్సుకు నెలకు రూ.6 వేలు ఇచ్చాను. ఈ ఏడాది నుంచి రూ.10 వేలు అంటున్నాడు. ఆటోలో పది మందిని కుక్కేస్తున్నాడు. పొద్దున్నే పొలం పనికి వెళతాం. పిల్లలను తీసుకెళ్లే అవకాశం లేదు. మరీ అంతా అంటే.. ట్రంప్‌ దెబ్బతో డీజిల్‌ రేటు పెరిగిందంటున్నారు.  
– ఉత్తర సోమేశ్‌కుమార్‌ (కేసముద్రం, విద్యార్థి తండ్రి) 

Advertisement
 
Advertisement
Advertisement