వయోపరిమితి పెంపు రెండేళ్లే! | Age limit extended Two years for Government jobs! | Sakshi
Sakshi News home page

వయోపరిమితి పెంపు రెండేళ్లే!

Jan 21 2014 3:49 AM | Updated on Mar 28 2019 6:33 PM

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో గరిష్ట వయోపరిమితిని రెండేళ్లు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో గరిష్ట వయోపరిమితిని రెండేళ్లు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఐదేళ్లు పెంచాలని నిరుద్యోగుల డిమాండ్‌ను పక్కనబెట్టి రెండేళ్ల పెంపునకే సాధారణ పరిపాలన శాఖ(సర్వీసెస్) ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. 2011లో గరిష్ట వయోపరిమితిని ఐదేళ్లు పెంచాలని కోరినా ప్రభుత్వం రెండేళ్లకే పరిమితం చేసింది. 2012లో గ్రూపు-1, గ్రూపు-2 వంటి కీలక నోటిఫికేషన్లు ఇవ్వలేదు. జారీ చేసిన కొన్నింటికి వయోపరిమితి పెంపును విస్మరించింది.

2012 డిసెంబరులో ఉద్యోగ పరీక్షల వార్షిక కేలండర్‌కు, గ్రూపు-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూపు-1లో విలీనం (గ్రూపు-1బీగా) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 2013లో నోటిఫికేషన్ల జారీకి చర్యలు చేపట్టింది. 34 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని 36 ఏళ్లు చేస్తూ (రెండేళ్లు పెంచుతూ) ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ 65 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇచ్చింది. పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌వో, వీఆర్‌ఏ మినహా మరే నోటిఫికేషన్ జారీ కాలేదు. డిసెంబరు 31తో ఆ ఉత్తర్వుల గడువు ముగిసిపోయింది. ప్రస్తుతం గ్రూపు-1, జోనల్ వ్యవస్థ కలిగిన పోస్టులు మినహా మిగతా పోస్టుల భర్తీ కోసం నియామక సంస్థలు ఇండెంట్లు తెప్పిస్తున్నాయి. ప్రభుత్వం రెండేళ్ల గరిష్ట వయోపరిమితి పెంపునకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement