ఉద్యోగాల దరఖాస్తు ఫీజు 5 రెట్లు పెంచిన టీజీపీఎస్సీ
2024 గ్రూప్–1 నోటిఫికేషన్లో దరఖాస్తు రుసుం రూ.200
తాజాగా విడుదల చేసిన ఏఈ పోస్టుల అప్లికేషన్ ఫీజు రూ.1,000గా ప్రకటన
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలని వెల్లడి
నిరుద్యోగుల ఆగ్రహం..పెనుభారం పడుతుందంటూ ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్ని స్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) షాకిచ్చింది. ఇప్పటివరకు టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు దరఖాస్తు రుసుము రూ.200 ఉండగా.. తాజాగా దీన్ని ఐదు రెట్లు పెంచింది. అంటే ఇకపై ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే రూ.1,000 ఫీజు చెల్లించాలన్నమాట. గత వారం టీజీపీఎస్సీ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి మూడు నోటిఫికేషన్లు విడుదల చేసింది. రహదారులు, భవనాల శాఖ పరిధిలో 222 అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) 49, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) పరిధిలోని 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసింది.
ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు రుసుమును రూ.1,000గా ఖరారు చేసింది. జనరల్, బీసీ అభ్యర్థులు రూ.1,000 చొప్పున అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని నోటిఫికేషన్లో వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.500 చొప్పున చెల్లించాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. అయితే వీరి దరఖాస్తు ఫీజు గతంలో రూ.100 మాత్రమే కావడం గమనార్హం.
అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని పరీక్షలన్నీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించడంతో టీజీపీఎస్సీకి నిర్వహణ ఖర్చు చాలావరకు కలిసివచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ దరఖాస్తు రుసుమును ఏకంగా 5 రెట్లు పెంచడంపై నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే వేలల్లో ఫీజు చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు.
యూపీఎస్సీ, ఎస్ఎస్సీల కంటే చాలా ఎక్కువ
టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసిన రాష్ట్ర ప్రభుత్వం..యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) తరహాలో తీర్చిదిద్దుతామని స్పష్టం చేసింది. టీజీపీఎస్సీ కూడా తమకు యూపీఎస్సీ, ఎస్ఎస్సీలు రోల్ మోడల్ అని ప్రకటించింది. అయితే యూపీఎస్సీ పరీక్షలకు ఫీజు రూ.100 నుంచి రూ.200 మధ్యనే ఉండటం గమనార్హం. ఇక ఎస్ఎస్సీ నిర్వహించే ప్రధాన పరీక్షలకు ఫీజు రూ.100 మాత్రమే ఉంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులపై పెను భారం!
గ్రూప్1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియంతా టీజీపీఎస్సీ ద్వారానే జరుగుతుంది. నోటిఫికేషన్లు వెలువడినప్పుడు అభ్యర్థులు సైతం పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటారు. పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో నోటిఫికేషన్కు 4 లక్షల నుంచి 9 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సందర్భాలున్నాయి.
2024 గ్రూప్–1 నోటిఫికేషన్ వెలువడినప్పుడు ఏకంగా 4 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. చివరగా భర్తీ చేసిన గ్రూప్–4 ఉద్యోగాల కోసం 9.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో దరఖాస్తు రుసుము 5 రెట్లు పెంచుతూ తాజాగా కమిషన్ తీసుకున్న నిర్ణయం నిరుద్యోగ అభ్యర్థులపై, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులపై పెనుభారం మోపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


