రైతన్నకు మేలు చేసే పశువుల బీమా పథకం ధీమా ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మక ంగా ప్రవేశపెట్టినా పశుసంవర్ధకశాఖ నిర్లక్ష్యం కారణంగాను, ప్రచార లోపంతోను పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.
కడప అగ్రికల్చర్ : రైతన్నకు మేలు చేసే పశువుల బీమా పథకం ధీమా ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మక ంగా ప్రవేశపెట్టినా పశుసంవర్ధకశాఖ నిర్లక్ష్యం కారణంగాను, ప్రచార లోపంతోను పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఈ పథకంపై సరైన అవగాహన కల్పించే వారు కరువవడంతో పథకాన్ని వినియోగించుకోలేక పోతున్నామని రైతులు తెలిపారు.
జిల్లాలో పశు సంపద సమృద్ధిగా ఉన్నా ఆ స్థాయిలో రైతులకు న్యాయం చేసే అధికారులు, పశువైద్యులు తక్కువయ్యారనే విమర్శిలు మెండుగా ఉన్నాయి. పశువుల బీమా ప్రీమియం చెల్లింపునకు ఈనెలాఖరుతో గడువు తీరనుంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 3,75,623 లక్షల పశువులుండ గా 1570 పశువులకు మాత్రమే ప్రీమియంను రైతుల నుంచి కట్టించారు. ఈ విధంగా బీమా చేయించిన రీతి చూస్తుంటే పశుసంవర్థకశాఖలోని అధికారుల, వైద్యుల శ్రద్ధ ఏపాటిదో ఇట్టే అర్థమవుతుంది.
2008 సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పశుసంపదను నమ్ముకుని జీవనం సాగిస్తున్న రైతులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి పాడి పశువులు సీజనల్ వ్యాధుల, ఇతర కారణాలు, ప్రకృతి విపత్తులతోను చనిపోతే రైతు నష్టపోకుండా పశువుల బీమా పధకాన్ని తీసుకువచ్చారు.
దేశవాళీ, సంకరజాతి ఆవులు, గేదెలకు రైతులు ఈ పధకంలో బీమా చేయించవచ్చు. అన్ని రకాల పశువులకు బీమా చేసుకునేందుకు వీలు కల్పించారు. ఒక రైతు రెండు పశువులకు ఈ పధకంలో ఏడాదికి, మూడేళ్ల కాలపరిమితికి మాత్రమే బీమా చేయించుకోవడానికి అవకాశం ఉంది. బీమా చేసిన ప్రతి ఆవుకు, గేదెకు పశువైద్యాధికారి ఎదుట చెవిపోగు వేస్తారు. ప్రమాదవశాత్తు, ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధుల బారినపడి బీమా చేయించిన పశువు మరణిస్తే దాని విలువ ఆధారంగా రైతులు బీమా పొందవచ్చు. అంతేగాక బీమా చేసిన పాడి రైతు కూడా ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి ఆసరాగా రూ. లక్ష వరకు బీమా అందిస్తారు. ఇందుకోసం అదనపు బీమా చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ ఆర్ధిక సంవత్సరంలో 8500 పాడిపశువులకు బీమా చేయించాలని రాష్ట్రశాఖ లక్ష్యంగా నిర్ణయించింది. గత ఏడాది ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు క్షీరసాగర్ పధకంలో 1487 పాడిపశువులకు బీమా ప్రీమియం చెల్లించారు. అలాగే సాధారణ పధకంలో 85 పాడిపశువులకు బీమా ప్రీమియం తమ వాటాగా కంపెనీకి చెల్లించారు. బీమా చేయించడానికి ఈనెలఖరు వరకు మాత్రమే గడువు ఉంది.