సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై ఏసీబీ కొరడా

ACB Attack on sub registrar offices - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శుక్రవారం మెరుపుదాడులు చేసింది. ఏసీబీ డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఆదేశాలతో 13 జిల్లాల్లో ఎంపిక చేసుకున్న 13 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. సోదాల్లో అనధికార డాక్యుమెంట్‌ రైటర్లను గుర్తించడంతోపాటు కార్యాలయాల్లో లెక్కల్లో చూపని అక్రమ సొమ్ము రూ.10,34,256 స్వాధీనం చేసుకున్నారు. అన్ని జిల్లాల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకొని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేయనున్నట్టు ఏసీబీ డీజీ తెలిపారు. 

బట్టబయలైన అక్రమాలు..
- ఆస్తుల క్రయవిక్రయాలు చేసిన వారు రిజిస్ట్రేషన్‌ కోసం వస్తే డబ్బులు వసూళ్లు జరుగుతున్నాయి. కొనుగోలు చేసిన ఆస్తిని బట్టి రేటు పెట్టి మామూళ్లు దండుకుంటున్నారు.
ప్రతి రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వద్ద అనధికార డాక్యుమెంట్‌ రైటర్లు, ప్రైవేట్‌ వ్యక్తులను గుర్తించారు.
రిజిస్ట్రార్, సిబ్బంది వద్ద ఉన్న పుస్తకాలు, డాక్యుమెంట్లు, టేబుల్‌ సొరుగుల్లో లెక్కల్లో చూపని అక్రమ సొమ్మును గుర్తించారు.
రిజిస్ట్రార్‌లకు ఇచ్చేందుకు అనధికార డాక్యుమెంట్‌ రైటర్లు తెచ్చిన మొత్తాలను స్వాధీనం చేసుకున్నారు.

టోల్‌ ఫ్రీ నంబర్‌ ఫలితం
రాష్ట్రంలో అవినీతి ప్రక్షాళన కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన స్పందన 14400 టోల్‌ ఫ్రీ నంబర్‌ ఫలితాలిస్తోంది. దీనికి రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతలు చేపట్టిన రెండో రోజునే ఏసీబీ డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు 14400కు వస్తున్న ఫిర్యాదులను సమీక్షించారు. అత్యధిక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న ప్రభుత్వ శాఖల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నాలుగో స్థానంలో ఉన్నట్టు గుర్తించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పట్టిన అవినీతి మకిలిని వదిలించేందుకు ఏసీబీ డీజీ చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఏకకాలంలో అన్ని జిల్లాల్లోను సోదాలు నిర్వహించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top