అశ్రునివాళి.. | A tribute to the daughter of the mayor of leaders | Sakshi
Sakshi News home page

అశ్రునివాళి..

Nov 19 2015 2:09 AM | Updated on Aug 13 2018 3:10 PM

చిత్తూరు మేయర్ దంపతులకు ప్రజానీకం అశ్రునివాళుర్పించింది. మంగళవారం జరిగిన హత్యకాండలో ప్రాణాలు కోల్పోయిన మేయర్

మేయర్ దంపతులకు నేతల శ్రద్ధాంజలి
హత్యకు నిరసనగా చిత్తూరులో బంద్
గంగన్నపల్లిలో నేడు అంత్యక్రియలు

 
చిత్తూరు మేయర్ దంపతులకు ప్రజానీకం అశ్రునివాళుర్పించింది. మంగళవారం జరిగిన హత్యకాండలో ప్రాణాలు కోల్పోయిన మేయర్ అనురాధ,ఆమె భర్త కఠారి మోహన్‌ల భౌతిక కాయాలను ప్రజల సందర్శననార్థం బుధవారం చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఉంచారు. ప్రజలు కన్నీటిపర్యంతమయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. గురువారం మధ్యాహ్నం గంగనపల్లెలోని మేయర్ దంపతులకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హత్యకు నిరసనగా బుధవారం చిత్తూరు బంద్‌లో బంద్ పాటించారు. ఈసందర్భంలో టీడీపీ కార్యకర్తలు నాలుగు ఆర్టీసీ బస్సుల్ని ధ్వంసం చేశారు.
 
చిత్తూరు: చిత్తూరు మేయర్ కఠారి అనురాధ,ఆమె భర్త కఠారి మోహన్ లను దారుణంగా హత్య చేసింది మోహన్ మేనల్లుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూ అని, కఠారి కుటుంబ సభ్యులు, అనుచరులు, పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. బుధవారం మధ్యాహ్నం చిత్తూరుకు చేరుకున్న ముఖ్యమంత్రి తొలుత 3.30 ప్రాంతంలో కఠారి దంపతుల భౌతిక కాయాలకు నివాళులర్పించారు. అనంతరం తనయుడు లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు, ఐజీ వేణుగోపాల కృష్ణ, చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ తదితరులతో కలసి  సీఎం కార్పొరేషన్ కార్యాలయంలో హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించారు. కఠారి అనురాధ ఎక్కడ హత్యకు గురైంది, మోహన్‌పై దాడి, దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా వెళ్లారు? తదితర వివరాలను అడిగి తెలుసుకుని ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ఆ తరువాత సీఎం పోలీసు అధికారులతో కార్యాలయంలోనే సమావేశమయ్యారు. దాడికి సంబంధించి వివరాలను తెలుసుకున్నారు.  కొందరు కిరాయి దుండగులతో కలిసి చింటూ స్వయంగా దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు ముఖ్యమంత్రికి వివరించినట్లు సమాచారం.

దాడికి ఉపయోగించిన పిస్టల్, మిగిలిన ఆయుధాలకు సంబంధించిన వివరాలు, దాడిలో పాల్గొన్న కిరాయి హంతకులు ఎక్కడి వారు? దాడి అనంతరం ఎలా పారిపోయారు? పోలీసు జాగిలం నేరుగా చింటూ కార్యాలయానికి వెళ్లడం, ఈ కేసులో లభించిన ఆధారాలను పోలీసులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి కఠారి కుటుంబ సభ్యులతో పాటు కార్పొరేటర్లు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో కలిసి మేయర్ దంపతులపై దాడి సమయంలో అక్కడే ఉన్న  కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, కఠారి అనుచరులతో మాట్లాడారు. చింటూనే స్వయంగా ఈ ఘటనలో పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు ముఖ్యమంత్రికి తెలిపారు. తనను కాల్చొద్దురా..అంటూ అనురాధ ప్రాధేయపడినా చింటూ పిస్టల్‌తో పిట్టను కాల్చినట్టు ఆమెను కాల్చాడని వారు సీఎంకు వివరించారు. దుండగులను ఎదిరించే క్రమంలో గాయపడ్డ వారిని సైతం ముఖ్యమంత్రి పరామర్శించినట్లు సమాచారం. సమావేశంలో ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ సైతం పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement