2011 గ్రూప్1 ఫలితాలు విడుదల
మెయిన్స్తో సహా ఇంటర్వ్యూల మార్కులు ప్రకటించిన ఏపీపీఎస్సీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2011 గ్రూప్1 పరీక్షల నోటిఫికేషన్కు సంబంధించిన తుది ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం రాత్రి ప్రకటించింది. 152 పోస్టులకు పోటీపడిన 294 మంది అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షలో, ఇంటర్వ్యూల్లో వచ్చిన మార్కులను వెల్లడించింది. వీటితో పాటు మెయిన్స్ పరీక్షకు హాజరైన మొత్తం 2,691 మందికి సంబంధించి సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులను, మొత్తం మార్కుల జాబితాలను కూడా తన వెబ్సైట్లో పొందుపరిచింది.
15 రకాల పోస్టులకు ఆయా అభ్యర్థుల రిజర్వేషన్ కేటగిరీ పోస్టు ప్రిఫరెన్స్ తదితరాలను అనుసరించి ఈ ఎంపిక జాబితాను వారం రోజుల్లో ప్రకటిస్తామని కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయభాస్కర్ ‘సాక్షి’కి వివరించారు. ఈ గ్రూప్1 ఇంటర్వ్యూల మార్కుల జాబితా లీక్పై సీబీసీఐడీ విచారణకు ప్రభుత్వానికి లేఖ రాయ నున్నామని చెప్పారు. మెయిన్స్లో అర్హత సాధించిన వారిలో ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున 152 పోస్టులకు 294 మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. వీరికి జనవరి 22 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీరి మెయిన్స్, ఇంటర్వ్యూ మార్కులను కమిషన్ మంగళవారం విడుదల చేసింది. 294 మందిలో దివ్యాంగుల కోటాలోని ఒక అభ్యర్థిని అనర్హుడిగా గుర్తించారు. నలుగురు అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకాలేదు.