మదనపల్లె టౌన్: అప్పుల బాధతో ఓ మహిళా రైతు ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. మదనపల్లె జిల్లా ఆసుపత్రి అవుట్పోస్ట్ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని మాలెపాడు పంచాయతీ, ఎగువ దొనబయలకు చెందిన నారాయణస్వామి భార్య కళావతమ్మ (50) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఇటీవల టమాటా, ఇతర కూరగాయల పంటల సాగు కోసం సుమారు రూ.5 లక్షల వరకు అప్పులు చేసింది. అయితే పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పెట్టుబడులు సైతం తిరిగి రాక, చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఎలుకల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కళావతమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.


