కడప సెవెన్రోడ్స్ : యూసీఐఎల్కు సంబంధించిన భూసేకరణ, కణంపల్లి కొత్త ప్రాజెక్టు, కొట్టాల గ్రామ సమస్యపై నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టి ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం రాష్ట్ర రాజధాని నుంచి రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనాయూసీఐఎల్ సమస్యపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వర్చువల్గా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, యూసీఐఎల్ ప్రతినిధులు ఆనందరావు, శ్రీనివాసులురావు హాజరయ్యారు. ఈ సమీక్షలో ప్రిన్సిపల్ సెక్రటరీ కణంపల్లి కొత్త ప్రాజెక్టుకు అవసరమైన భూముల వివరాలు, కొట్టాల గ్రామ భూభాగం, సరిహద్దుల నిర్ధారణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ భూముల పూర్తి వివరాలను గుర్తించి, సరిహద్దులను నిర్ధారించి, సంబంధిత ప్రభుత్వ విభాగాలకు సమర్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు ఇదే సమయంలో ప్రస్తుత టైలింగ్స్ పాండ్ సామర్థ్యాన్ని దష్టిలో ఉంచుకుని దాని ఎత్తు పెంపు పనులను కూడా వేగవంతం చేయాలని సమావేశంలో చర్చించారు. ఇందుకు టెండర్ ప్రక్రియ కొనసాగుతోందని యూసీఐఎల్ ప్రతినిధులు తెలిపారు. కొట్టాల గ్రామ ప్రజల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని వారితో సంప్రదింపులు జరపాలని, అవసరమైన అనుమతులు లభించిన అనంతరం నిబంధనల ప్రకారం భూసేకరణ, అర్హులకు పరిహారం చెల్లింపు జరుగుతుందని వారికి స్పష్టత ఇవ్వాలని సూచించారు. ప్రస్తుత టైలింగ్స్ పాండ్ ఎత్తు పెంపు, కణంపల్లి కొత్త ప్రాజెక్టు, కొత్త టైలింగ్స్ పాండ్కు అవసరమైన భూములు, అనుమతుల ప్రక్రియలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని, ఎలాంటి జాప్యం లేకుండా నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
ముఖ్యమంత్రి సూచనలను
పకడ్బందీగా అమలు చేయాలి
విజన్ యాక్షన్ యూనిట్స్, పీ4, పీజీఆర్ఎస్ తదితర అంశాల్లో ముఖ్యమంత్రి సూచనలు, ఆదేశాలను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం విజయవాడ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ యాక్షన్ యూనిట్స్, పీ4 తదితర అంశాల అమలు పురోగతిపై.. రాష్ట్రంలోని ఎంపీలు, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తోపాటు జేసీ డాక్టర్ నిధీమీనా హాజరయ్యారు. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి సమీక్షలో ప్రస్తావించిన అంశాలపై సంబంధిత శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలను అధికారులకు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో సీపీఓ హజరతయ్య, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, జీఎస్డబ్ల్యూఎస్ జిల్లా అధికారి ప్రతాప్ రెడ్డి, ఏపీఐఐసీ జెడ్ఎం శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


