ఒక ప్రశ్న.. రెండు జవాబులు !
● రాజోలి ప్రాజెక్ట్పై భిన్నమైన సమాచారం
● శాసనమండలిలో
అవార్డు పాస్ కాలేదన్న మంత్రి
● సమాచార హక్కు చట్టంలో
అవార్డు పాస్ అయినట్లు ఉంది
● దీనిపై శానసమండలి చైర్మన్కు
ఫిర్యాదు చేస్తా : పీఆర్
జమ్మలమడుగు : రాజోలి ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకే ప్రశ్నకు విరుద్ధ సమాధానాలు ఇచ్చి రైతుల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. ఇటీవల శాసన మండలిలో ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి రాజోలి ఆనకట్టకు సంబంధించిన భూములు అవార్డు చేశారా.. పరిహారం పెంచి ఇస్తున్నారా..? ఎప్పుడు ఇస్తున్నారో తెలపాలంటూ శాసన మండలిలో ప్రశ్న వేశారు. దీనిపై మంత్రి, సెక్రటరీలు అసలు అవార్డు పాసు కాలేదు. పరిహారం లేదు. పరిహారం అనే ప్రశ్న ఉత్పన్నం కాదంటూ సమాధానం రాత పూర్వకంగా ఇచ్చారు. అయితే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సమాచారం హక్కు చట్టం కింద రాజోలి ఆనకట్ట కింద ముంపునకు గురి అయ్యే పట్టా భూములకు ఎంత పరిహారం నిర్ణయించారు అన్న ప్రశ్నకు అధికారులు 12.5 లక్షల రూపాయలు నిర్ణయించామని సమాధానం చెప్పారు. అంతేకాకుండా 2013 ఎకరాలు అవార్డు పాసు చేసనట్లు ఆ కాపీని జత పరిచామని, ఆ భూములన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని వాటిని అమ్ముటకు, భూముల మీద బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకొనుటకు ఎటువంటి అర్హత లేదని జీఎన్ఎస్ఎస్ సబ్ కలెక్టర్ బి.శాంతమ్మ సమాధానం ఇచ్చారు.
సభకు తప్పుడు సమాధానం ఇచ్చిన
మంత్రి, సెక్రటరీ
క్షేత్ర స్థాయిలో పెద్దముడియం మండలం రాజోలి ఆనకట్టకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి రాజోలి ప్రాజెక్టుగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజోలి ప్రాజెక్టు నిర్మాణం కోసం 8 వేల ఎకరాల భూమి అవసరం అని నాలుగు వేల ఎకరాల భూమి అవార్డు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. రెవెన్యూ శాఖ అధికారులు గ్రామాలు తిరిగి 4 వేల ఎకరాల భూసేకరణ చేశారు. ఈ భూమిలో జీఎన్ఎస్ఎస్ అధికారులు ముంపునకు గురి అయ్యే 2013 ఎకరాలకు అవార్డు పాసు చేసి ప్రతి ఎకరాకు 12.5 లక్షల రూపాయలు భూములకు పరిహారం ఇస్తామని ప్రకటించారు. శాసనమండలిలో రాజోలి నిర్మాణం కోసం ఎటువంటి భూములు తీసుకోలేదు. అవార్డు పాసు చేయలేదని పరిహారం ఇచ్చేది లేదంటూ ఇరిగేషన్ మంత్రి, సెక్రటరీలు సమాధానం ఇచ్చారు. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం అవార్డు అయిందని అధికారులు సమాచార హక్కు చట్టం కింద సమాధానం ఇచ్చారు. దీంతో అధికారులు పూర్తిగా సభకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అయింది.
ప్రభుత్వానికి రైతాంగం,
ప్రాజెక్టుల నిర్మాణంపై తీవ్ర నిర్లక్ష్యం
రాజోలి ప్రాజెక్టు నిర్మాణం విషయంలో శాసనమండలిలో తాను అడిగిన ప్రశ్నలకు మంత్రితోపాటు సెక్రటరీలు తనకు తప్పుడు సమాచారం ఇవ్వడంతోనే వారికి రైతులన్న, ప్రాజెక్టుల నిర్మాణాలపై తీవ్ర నిర్లక్ష్యం అనే విషయం అర్థమవుతోందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అన్నారు. ఆయన సాక్షితో మాట్లాడుతూ రాజోలి నిర్మాణం భూసేకరణకు అవార్డు జరిగిందా, ఎంత పరిహారం ఇస్తారన్న ప్రశ్నలకు తప్పుడు సమాధానం ఇచ్చి సభనే తప్పుదోవ పట్టించారు. దీనిపై తాను సీరియస్గా తీసుకుంటాను. సభ చైర్మన్కు ఫిర్యాదు చేయబోతున్నాను. జమ్మలమడుగు సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో రాజోలి ఆనకట్టకు సంబంధించిన భూములను ప్రభుత్వ అనుమతి లేనిదే రిజిస్ట్రేషన్లు చేయడం లేదని సమాధానం ఇచ్చారు. జీఎస్ఎస్ఎస్ సబ్కలెక్టర్ శాంతమ్మ అవార్డు పాసు అయినట్లు రాత పూర్వకంగా సమాచారం హక్కు చట్టం కింద తనకు సమాధానం ఇచ్చారు. కాని శాసనమండలిలో మాత్రం అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంపై ప్రభుత్వానికి రైతులన్న, నీటి ప్రాజెక్టు నిర్మాణంపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందని ఆయన తెలిపారు.


