జగన్ సీఎం అయితేనే ఉద్యోగ అవకాశాలు
శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి
రాజంపేట టౌన్ : వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే రాష్ట్రంలో యువతకు, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభించగలవని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్) మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి తెలిపారు. పట్టణంలోని బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్యన్ ఓవర్సీస్ సంస్థను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనేక మంది విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకుంటారని, అయితే వారికి సరైన కళాశాలలు, అక్కడి పరిస్థితులు వంటివి తెలియక ఇబ్బందులు పడుతుంటారన్నారు. అలాంటి వారి కోసం రాజంపేట పట్టణానికి చెందిన కటారు నరసింహారెడ్డి ఆర్యన్ ఓవర్సీస్ సంస్థను ప్రారంభించడం ఎంతైనా అభినందనీయమని తెలిపారు. చాలా మంది విద్యార్థులు దళారుల మాటలు నమ్మి మోసపోతుంటారన్నారు. అయితే తిరుపతిలో ఉన్న ఈ సంస్థ యాజమాన్యం దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి దేశ, విదేశాల్లో అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించే కళాశాలల్లో అడ్మిషన్లు ఇప్పిస్తుండటం గొప్ప విషయమని తెలిపారు. కటారు నరసింహారెడ్డిది స్వగ్రామం రాజంపేట అని అందువల్ల తన సొంత ప్రాంతంలోని విద్యార్థులకు సేవలందించేందుకు ఇక్కడ కూడా బ్రాంచ్ ఏర్పాటు చేసి సొంత ఊరిపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారని తెలిపారు. కడప మేయర్ పాకా సురేష్ మాట్లాడుతూ ఎంపీసీ, బైపీసీ, ఎంబీబీఎస్, బీటెక్ పూర్తి చేసుకొని ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులు ఆర్యన్ ఓవర్సీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కడపకు చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వల్లూరు వంశీనాథ్రెడ్డి, ఆర్యన్ ఓవర్సీస్ సంస్థ వ్యవస్థాపకులు కటారు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లారీ బోల్తా.. డ్రైవర్కు గాయాలు
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని కదిరి రోడ్డులో కంకర మిషన్ వద్ద మంగళవారం సాయంత్రం సిమెంట్ లారీ బోల్తా పడింది. ఎరగ్రుంట్ల నుంచి బెంగళూరుకు సిమెంట్ను లారీ తీసుకెళుతుండగా.. కంకర మిషన్ సమీపంలో బోల్తా పడింది. దీంతో డ్రైవర్ మస్తాన్రెడ్డికి గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనానికి సమాచారమివ్వడంతో సంఘటనా స్థలానికి వెళ్లి గాయాలపాలైన మస్తాన్రెడ్డిని చికిత్స కోసం పులివెందుల సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.
జగన్ సీఎం అయితేనే ఉద్యోగ అవకాశాలు


