నైపుణ్య నిధిగా ‘స్టార్ట్ అప్ కడప’ అభివృద్ధి
కడప సెవెన్రోడ్స్ : జిల్లా యువతకు నైపుణ్య నిధిగా రూపుదిద్దుకుంటున్న ‘స్టార్ట్ అప్ కడప ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్’.. రాష్ట్రానికే స్ఫూర్తిగా నిలవనుందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో పీ4 విధానం ద్వారా జిల్లాలో ఇన్నోవేటీవ్గా నిర్మిస్తున్న ‘స్టార్ట్ అప్ కడప’ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతిపై జేసీ డా.నిధి మీనాతో కలిసి.. సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రూపుదిద్దుకుంటున్న స్టార్ట్ అప్ కడప ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్.. యువ స్టార్టప్ వ్యవస్థాపకులు, ఫ్రీలాన్సర్లు, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల అభివద్ధికి పునాది వేస్తూ, కడపను వ్యాపార అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కీలక పాత్ర పోషించనుందన్నారు. అనంతరం మధ్యాహ్నం కడప ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న పి–4 స్టార్టప్ కడప సెంటర్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, , కేఎంసీ కమిషనర్ మనోజ్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, హౌసింగ్ పీడీ రాజా రత్నం, స్టెప్ సీఈవో నోడల్ అధికారి జోయల్ విజయ్ కుమార్, ఏడీపీ యంగ్ ప్రొఫెషనల్స్ తదితరులు పాల్గొన్నారు.
పీఎంశ్రీ అభివృద్ధి పనులను పూర్తి చేయాలి
పీఎంశ్రీ కేంద్ర నిధులతో విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టే అన్నిరకాల అభివృద్ధి పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో కేంద్ర నిధులతో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఈవో షంషుద్దీన్, ఎస్ఎస్ఏ ఏపీసీ ప్రేమంత్ కుమార్, ఎస్ఎస్ఏ, విద్యాశాఖ సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎకో–సెన్సిటివ్ జోన్ల నిబంధనలు పాటించాలి
అటవీ వన్యప్రాణుల పరిరక్షణ చర్యల్లో భాగంగా ప్రతి రక్షిత అడవి, జాతీయ పార్కు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం చుట్టూ 1 కి.మీ ఈఎస్జెడ్ ఏర్పాటు చేయాలనే నియమాన్ని పాటించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో జిల్లాలో శ్రీ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్(ప్రొద్దుటూరు), శ్రీ లంక మల్లేశ్వర వైల్డ్లైఫ్ శాంక్చరీ(బద్వేలు) జోనల్ మాస్టర్ ప్లాన్ తయారీలో భాగంగా.. తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ అటవీ పరిరక్షణలో కీలకమైన ఎకో–సెన్సిటివ్ జోన్ (ఈఎస్జెడ్) పరిధిలో పాటించవలసిన నిబంధనలపై జిల్లా కలెక్టర్ జిల్లా అటవీశాఖ అధికారి వినీత్ కుమార్ తోకలిసి స్టేక్హోల్డర్స్ సమావేశం జరిగింది. ప్రధానంగా రెండు ఎకో–సెన్సిటివ్ జోన్లకు సంబంధించిన నియంత్రణలో భాగంగా పాటించవలసిన నిబంధనల గురించి చర్చించారు. అలాగే అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో అటవీ శాఖ, అన్ని భాగస్వామ్య శాఖల అధికారులు, పర్యావరణ నిపుణులు, ప్రాంతీయ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి


