● సమన్వయం తలకు మించిన భారమే...
సాక్షి ప్రతినిధి, కడప: పచ్చ పార్టీలో నేతల మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటోంది. రోజురోజుకు తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగలు కక్కుతోంది. నేతల మధ్య అంతర్యుద్ధ్యం తీవ్రమైంది. ఆదివారం ఆ పార్టీ కార్యాలయ భూమిపూజతో ఈ విషయం తేటతెల్లమైంది. ఒక్క ఎమ్మెల్యే మినహా మిగతా నేతలందరూ డుమ్మాకొట్టడం చర్చనీయంశమైంది. పార్టీలో అధికారం అండతో బలపడాలనే ఎత్తుగడలో కొందరుంటే, నాయకత్వ సమస్యకు అడ్డు లేకుండా చూసుకునే వారు మరికొందరు.. ఈ క్రమంలో ప్రజా సమస్యలను గాలికొదిలేస్తున్నారు. జిల్లాకు అన్ని హంగులున్నా అభివృద్ధి సాధించడంలో విఫలమవుతున్నారు. తమ సొంత ఆర్థిక పరిపుష్టి సాధనకు అడ్డదారులు ఎంచుకున్నారు.ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగుతమ్ముళ్లు మధ్య అక్రమ వ్యవహారాలల్లో పోటీ నెలకొంది.
● సుధీర్ఘకాలం తర్వాత టీడీపీ శాశ్వత భవనం కోసం ఆ పార్టీ నేతలు ఆదివారం భూమిపూజ చేశారు. అధికార బలంతో సుమారు రూ.40కోట్ల విలువైన ప్రభు త్వ స్థలాన్ని పార్టీ టీడీపీ కార్యాలయం కోసం కేటాయించిన విషయం తెలిసిందే. ఆరు నెలల్లో కార్యాలయం నిర్మిస్తామని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి సీఎం చంద్రబాబు సమక్షంలో మైదుకూరులో ప్రకటించారు. ఆ తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా మరుగుపర్చారు. సరిగ్గా ఏడాది తర్వాత నూతన అధ్యక్షుడు చదిపిరాళ్ల భూపేష్రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒక్క కమలాపురం ఎమ్మెల్యే చైతన్యరెడ్డి మినహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ డుమ్మా కొట్టడం గమనార్హం.
నేతల మధ్య ముదిరిన విభేదాలు
టీడీపీలో నేతల మధ్య గ్రూపు విభేదాలు అధికంగా ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఎప్పుడూ గెలవని పులివెందులలో సైతం తెలుగుతమ్ముళ్లు ఓవరాక్షన్ మితిమీరిపోయింది. ఏకంగా పోలీసుస్టేషన్లోనే ఎస్ఐ, సీఐ స్థాయి అధికారులపై సైతం జులుం ప్రదర్శిస్తున్నారు. ఇక బద్వేల్లో డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి, ఇన్ఛార్జి రితీష్రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు ముదిరిపోయాయి. పైగా సూర్యనారాయణరెడ్డి ఆర్థిక స్థోమత నేపధ్యంలో పార్టీని కనుసైగలతో శాసిస్తున్న మంత్రి నారా లోకేష్ చూపు కూడా పడింది. ఈక్రమంలో సుధీర్ఘకాలం పార్టీలో విస్తృత సేవలు అందించిన మాజీ మంత్రి బద్వేల్ వీరారెడ్డి వారసులకు త్వరలో చెక్ పడే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా ప్రొద్దుటూరు, కడప నియోజకవర్గాలల్లో సీనియర్లు.. ఇటీవల పెత్తనం చలాయించే నేతల మధ్య తీవ్ర విభేదాలున్నాయి. అధికారంలోకి వచ్చిన టీడీపీ కండువా కప్పుకున్న నేతలకు ప్రాధాన్యత ఉండడంపై పలువురు రగిలిపోతున్నారు.
పార్టీ కార్యాలయ భూమిపూజతో స్పష్టం
ఒక్క ఎమ్మెల్యే మినహా డుమ్మా కొట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, నేతలు
వయస్సుకు మించిన హోదాలో భూపేష్రెడ్డి
నేతల మధ్య సమన్వయం కత్తి మీద సామే
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన భూపేష్రెడ్డికి పార్టీని నడిపించడం అంత సునాయసం కాదనే విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కడప పార్లమెంటు పరిధిలో నాలుగు నియోజకవర్గాలల్లో నేతల మధ్య అసంతృప్తుల బెడద వెంటాడుతోంది. జమ్మలమడుగు రాజకీయాలకే పరిమితమైన భూపేష్రెడ్డి జిల్లా సారధ్య బాధ్యతలు కష్టంతో కూడుకున్న పనిగా పలువురు వెల్లడిస్తున్నారు. పైగా పార్టీలో అంతర్గతంగా పైచేయి సాధించాలనే తపనతో ఉచ్చం, నీచం తేడా లేకుండా వ్యవహారిస్తున్న నేతలు సంఖ్య పెరుగుతుండడమే అందుకు కారణంగా చెప్పుకొస్తున్నారు. అక్రమంగా జూదశాలలు నిర్వహణ, అక్రమ మైనింగ్, ఇసుక దోపిడీ, భూకబ్జాలల్లో తెలుగుతమ్ముళ్లు మునిగి తేలుతున్నారు. ఈక్రమంలో టీడీపీ పట్ల జిల్లా ప్రజలకు విశ్వాసం పెంపొందించే చర్యలు చేపట్టడం భూషేష్రెడ్డికి ఆశామాషీ వ్యవహారం కాదని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.
● సమన్వయం తలకు మించిన భారమే...


