
శభాష్.. కీర్తిరెడ్డి
భర్త ప్రోత్సాహంతో సివిల్స్లో 316వ ర్యాంకు
కడప ఎడ్యుకేషన్: ఆమె సాధించిన ఈ విజయం మహిళలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే ఎంత పెద్ద లక్ష్యమైనా చేరుకోవచ్చునని ఆమె విజయం తెలియజేస్తోంది. ఆమె పేరే శ్రీనివాస కీర్తిరెడ్డి. కడప నగరానికి చెందిన ఈమె భర్త ప్రోత్సాహంతో సివిల్స్ ఫలితాల్లో 316 ర్యాంకు సాధించింది. కీర్తిరెడ్డి భర్త ఎంపాటి శ్రీసాయి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో భాగంగా విజయవాడలోని ఆల్ ఇండియా రేడియోలో న్యూన్ ఏపీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. కాగా భర్త ప్రోత్సాహంతో పాటు ఆయన గైడెన్స్తోనే కీర్తిరెడ్డి సివి ల్స్కు ఇంటి వద్దే నుంచే సివిల్స్కు ప్రిపేర్ అయ్యారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 316వ ర్యాంకు సాధించింది. కీర్తిరెడ్డి తండ్రి కేవీ చలమారెడ్డి కడపలోని ఎల్ఐసీలో అడ్మినిస్టేటివ్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చెందారు. తల్లి శ్రీకృష్ణ ఎల్ఐసీలో హైయర్ గ్రేడ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. కీర్తిరెడ్డి ప్రాథమిక విద్య రాజంపేటలోని నలంద హైస్కూల్లో పూర్తి చేయగా ఇంటర్మీడియట్ను హైదరాబాదులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో , ఇంజనీరింగ్ రాజస్తాన్లోని బిట్స్పిలానీలో పూర్తి చేశారు. కీర్తిరెడ్డికి ర్యాంకు రావడంపై బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.