భూదాన్పోచంపల్లి : ఇక్కత్ పరిశ్రమ తీరు తెన్నులను తెలుసుకునేందుకు శుక్రవారం 2025 బ్యాచ్కు చెందిన ఆరుగురు ట్రైనీ ఐఏఎస్ అధికారులు పోచంపల్లిలో పర్యటించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఓరిఝెంటేషన్ శిక్షణ పొందుతున్న వీరు క్షేత్ర స్థాయి పర్యటన నిమిత్తం పోచంపల్లిలోని టూరిజం పార్కు, చేనేత సహకార సంఘం, కళా పునర్వి హ్యాండ్లూమ్ యూనిట్, చేనేత గృహాలను సందర్శించి పలు అంశాలను పరిశీలించారు. వస్త్రోత్పత్తుల మార్కెటింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న చేనేత పథకాలపై ఆరా తీశారు. భూదానోద్యమ చరిత్ర, ఇక్కత్ వస్త్రాల ద్వారా పోచంపల్లికి ఉన్న ఖ్యాతిని తెలుసుకున్నారు. వీరి వెంట చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ వెంకట్రెడ్డి, చేనేత సహకార సంఘం మేనేజర్ రుద్ర ఆంజనేయులు ఉన్నారు.
యాదగిరీశుడి సేవలో..
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ట్రైనీ ఐఏఎస్ అధికారులు హరి ప్రసాద్, సురేష్, సాయి శివాని, సచిన్ బీజీ, శ్రీకాంత్రెడ్డి, పవన్ కుమార్లు శుక్రవారం దర్శించుకున్నారు. గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వీరికి వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. వీరికి తహసీల్దార్ గణేష్ నాయక్ స్వాగతం పలికారు.


