భువనగిరి: జిల్లా విద్యాశాఖను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపడానికి మండల విద్యాధికారులు కృషి చేయాలని డీఈఓ భిక్షపతి కోరారు. గురువారం భువనగిరి పట్టణంలో మండల విద్యాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలును విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. బడిబాట కార్యక్రమంలో షెడ్యూల్ ప్రకారం ఇచ్చిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులను వినియోగించుకుని ఈ నెల 12వ తేదీన పాఠశాలలను పండుగ వాతావరణంలో పునఃప్రారంభించుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలను ప్రభుత్వం జపాన్, సింగపూర్ దేశాల పర్యటనలకు తీసుకెళ్తుందని తెలిపారు. ఈ సమావేశంలో సెక్టోరియల్ అధికారులు పెసరు లింగారెడ్డి, శ్రీహరి అయ్యంగార్, జానీ అప్ఘన్, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.


