సాక్షి, యాదాద్రి : మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో మహిళా సమాఖ్య ప్రత్యేక సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా సంఘాలు సంప్రదాయ వృత్తులకు మాత్రమే పరిమితం కాకుండా ఆధునిక అవసరాలకు అనుగుణంగా నూతన వ్యాపార అవకాశాలను అన్వేషించాలనిసూచించారు. ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్, డిజిటల్ సేవలు, సూక్ష్మ పరిశ్రమలు, పర్యావరణ హితం ఉత్పత్తుల తయారీ, సేవా రంగం, ఇతర ఆదాయ వనరులపై దృష్టి సారించాలన్నారు. మహిళా సంఘాలకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల్లో అమలవుతున్న అన్ని పథకాల సమాచారాన్ని ఒక సమగ్ర పుస్తక రూపంలో రూపొందించి అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ వీరన్న, జిల్లా పరిశ్రమల అధికారి రవీందర్, వ్యవసాయ అధికారి రమణారెడ్డి, హార్టికల్చర్ అధికారి హేమలత, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కందుకూరి రేణుక, జిల్లా మహిళా సమాఖ్య కార్యదర్శి రచ్చ పల్లవి, కోశాధికారి అలివేలు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


