సూర్యాపేటటౌన్ : అప్పుల బాధతో అపార్ట్మెంట్ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సూర్యాపేట పట్టణంలో బుధవారం రాత్రి జరిగింది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణంలోని కృష్ణాటాకీస్ సమీపంలో బండారు బాలకృష్ణ(43) తన తల్లితో కలిసి నివాసముంటున్నాడు. బుధవారం సాయంత్రం తన అక్క వద్దకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. రాత్రి తన అక్క నివాసముంటున్న మున్సిపల్ కాంప్లెక్స్ వెనుక గల క్షేత్ర అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నాడు. నేరుగా లిప్టులో ఐదో అంతస్తుకు వెళ్లి అక్కడ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి సమయం కావడంతో ఎవరూ చూడలేదు. గురువారం ఉదయం అపార్ట్మెంట్ వాచ్మెన్ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా మృతుడు ప్యాంట్ జేబులో సూసైడ్ నోట్ లభించింది. అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని, తనకు రూ.10లక్షల వరకు అప్పు ఉందని, కొంతకాలంగా మానసిక వ్యాధితో ఇబ్బంది పడుతున్నాని రాశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు. మృతుడు అవివాహితుడు.
రూ.10లక్షల వరకు అప్పు ఉందని సూసైడ్ నోట్ రాసిన మృతుడు


