పెన్పహాడ్ : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన పెన్పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం చివ్వెంల మండలం కుడకుడకు చెందిన తూర్పాటి లక్ష్మయ్య(40), పర్వతం లక్ష్మయ్య, చింత అప్పలయ్యలతో కలిసి కారులో అన్నారంలోని ఓ పండుగకు వచ్చారు. ముగ్గురు కలిసి మద్యం తాగారు. తర్వాత తూర్పాటి లక్ష్మయ్య తన సొంత బామ్మర్థి పర్వతం లక్ష్మయ్య నిద్ర వస్తుందని అదే కారులో పడుకున్నారు. కొంత సేపటి తరువాత పర్వతం లక్ష్మయ్య లేచి వెళ్లాడు. తూర్పాటి లక్ష్మయ్య అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉన్నాడు. దీంతో మృతుడి భార్య శాంతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.
మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా
తూర్పాటి లక్ష్మయ్య మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. దీంతో మృతుడు సూర్యాపేటలోని 2వ వార్డు కుడకుడ జంగాల కాలానికి చెందిన వాడుకావడంతో ఆయన మృతిపై అనుమానం ఉందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. ఈ క్రమంలో తమకు తగిన న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిందితులను పోలీసులు కాపాడుతున్నారని వారు ఆరోపించారు. మృతుడిని ఉదయం ఇద్దరు వ్యక్తులు ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఆందోళన వద్దకు చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


