ఆన్లైన్లో రెవెన్యూ సేవలు
ఐదు గ్రామాల్లో అమలు
భువనగిరిటౌన్ : మీ సేవ కేంద్రాల ద్వారా అందించే రెవెన్యూ సేవల్లో పారదర్శకత, వేగవంతం కోసం ప్రభుత్వం ఆన్లైన్ విధానం తీసుకువచ్చింది. ధ్రువపత్రాల జారీలో జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పాలనా అధికారులకు కొత్తగా జీపీఓ మొబైల్ యాప్ను ప్రవేశపెట్టింది. పౌరసేవలకు సంబంధించిన దరఖాస్తుల వివరాలపై సిబ్బంది విచారణతో పాటు నివేదిక ప్రక్రియ అంతా ఇక యాప్ సాయంతో ఆన్లైన్లో నిర్వహించనున్నారు. దీంతో ప్రజలు సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు తప్పనున్నాయి. ఈమేరకు మంగళవారం అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, జగన్ మోహన్ ప్రసాద్తో కలిసి మొబైల్ యాప్ పని తీరుపై సంబంధిత అధికారులకు వీడియో కాన్ఫరెన్స్లో శిక్షణ ఇవ్వడంతో పాటు, సమస్యల పరిష్కారంపై అవగాహన కల్పించారు. క్షేత్ర స్థాయిలో ధ్రువీకరణ ప్రక్రియ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సిన విధానాన్ని వివరించారు.
ఈమేరకు రెండు నెలల క్రితం భువనగిరి మండలంలోని పెంచికల్పహాడ్, భువనగిరి పట్టణం, బీబీనగర్, కొండమడుగు, మక్త అనంతారం గ్రామాల్లో జీపీఓల ద్వారా పైలట్ దరఖాస్తులపై మొబైల్ యాప్ పనితీరును రెవెన్యూ అధికారులు పరిశీలించారు. యాప్ ఆచరణలో సాంకేతికంగా తలెత్తుతున్న అంశాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అందుకనుణంగా మార్పులు, చేర్పులు చేశారు. ప్రస్తుతం పైలట్ దశలో ఉన్న మొబైల్ యాప్ సాంకేతిక అడ్డంకులన్నీ అధిగమించి పూర్తి స్థాయి అప్లికేషన్ను ఈ నెల 25వ తేది నుంచి జీపీఓలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం జీపీఓ మొబైల్ యాప్ ద్వారా మరణ, కుల, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. త్వరలో పూర్తి రెవెన్యూ సేవలు జీపీఓ యాప్ ద్వారా అందించనున్నారు.
ఫ ప్రత్యేకంగా జీపీఓ యాప్ తీసుకువచ్చిన ప్రభుత్వం
ఫ ధ్రువపత్రాలు జారీ చేయడంలో జాప్యానికి చెక్


