అర్హత లేకున్నా కంటి వైద్యులుగా చెలామణి
మిర్యాలగూడ అర్బన్: అర్హత లేకున్నా కంటి వైద్యులుగా చెలామణి అవుతున్న ఐదుగురిని మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను బుధవారం డీఎస్పీ రాజశేఖరరాజు విలేకరులకు వివరించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం రావులపెంట గ్రామానికి చెందిన పజ్జూరి వికాస్కుమార్ డిగ్రీ మధ్యలోనే ఆపేశాడు. ఆ తర్వాత హైదరాబాద్లోని సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో డిప్లొమా ఇన్ ఆప్తమాలజిస్టు కోర్సు పూర్తి చేసి అక్కడే పలు కంటి ఆస్పత్రుల్లో పనిచేసిన అనుభవం ఉన్నట్లు ప్రచారం చేసుకుంటూ మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో మహాలక్ష్మి ఐ క్లినిక్ ఏర్పాటు చేశాడు. అధికారుల తనిఖీల నుంచి బయటపడేందుకు కన్సల్టెంట్ వైద్యుడి పేరు, సర్టిఫికెట్ వాడుకుంటూ అతడే వైద్యుడిగా చెలామణి అవుతున్నాడు. గతేడాది జూన్లో మిర్యాలగూడ పట్టణంలోని హౌజింగ్బోర్డు కాలనీకి చెందిన బైరెడ్డి పద్మ కంటి పరీక్షలు చేయించుకునేందుకు వికాస్కుమార్ ఆస్పత్రికి వచ్చింది. వికాస్కుమార్ ఆమెను పరీక్షించిన కుడి కంటిలో శుక్లాలు ఉన్నాయని సర్జరీ చేశాడు. మరుసటి రోజు నుంచి పద్మ కుడి కన్ను సరిగా కనిపించకపోడంతో.. వికాస్కుమార్ను నిలదీయదగా కొన్ని మందులు రాసి ఇచ్చాడు. అయినప్పటికీ ఉన్నచూపు కాస్త మందగించడంతో ఆమె పోలీసులు, వైద్యాధికారులు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన వన్టౌన్ సీఐ నాగభూషణం ఎలాంటి అర్హత లేకుండా వికాస్కుమార్ కంటి వైద్యం చేస్తున్నట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అదేవిధంగా ఇటీవల మెడికల్ కౌన్సిల్ అధికారుల తనిఖీల్లో డాక్టర్స్ కాలనీలోని శ్రీమహాలక్ష్మి, శాలిని, యశస్విని, అన్నపూర్ణ, రాఫా ఐ క్లినిక్లలో వల్కి శ్రీను, గడ్డం నాగరాజు, బానావత్ శివకోటేశ్వర్రావు, వెంకటేష్ సరైన అర్హతలు లేకున్నా డాక్టర్లుగా చెలామణి అవుతున్నట్లు తేలడంతో వారిని కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వన్టౌన్, టూటౌన్ సీఐలు నాగభూషణం, సోమనర్సయ్య, ఎస్ఐ సైదిరెడ్డి, హెడ్కానిస్టేబుల్ రాజారా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ ఐదుగురిని అరెస్ట్ చేసిన
మిర్యాలగూడ పోలీసులు


