తెగుళ్ల నివారణకు చర్యలు చేపట్టాలి
హుజూర్నగర్ : రైతులు వరిలో అగ్గి, మెడ విరుపు, ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు సరైన చర్యలు చేపట్టాలని కంపాసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తల బృందం తెలిపారు. బుధవారం హుజూర్నగర్, గరిడేపల్లి, కీతవారిగూడెం గ్రామాల్లో వరి పంటను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధన స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త లింగయ్య, సీనియర్ శాస్త్రవేత్త శ్రీధర్, సస్యరక్షణ శాస్త్రవేత్త రాములమ్మ మాట్లాడుతూ.. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అగ్గి తెగులు, ఆకుమచ్చ తెగులు వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉందని చెప్పారు. అగ్గి తెగులు పూతదశకు చేరిన పంటల్లో వెన్నుపై ఆశించినట్లయితే మెడ విరుపు తెగులుగా మారి దిగుబడి తక్కువగా ఉంటుందన్నారు. కాబట్టి రైతులు అగ్గి తెగులు, మెడ విరుపు, ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు ట్రైసైక్లాజోల్, మాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా ఐసోప్రోతయోలిన్ 1.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని చెప్పారు. వరిలో కాండం కుళ్లు, తెగులు ప్రధానంగా అధిక తేమ, నత్రజని ఎరువుల వాడకం వల్ల వస్తుందన్నారు. ఆకు తొడుగులపై నల్లటి మచ్చలు, కాండం కుళ్లడం, పిలకలు విరిగిపడటం దీని లక్షణాలని చెప్పారు. దీని నివారణకు ఎకరాకు 200గ్రా. కార్బెండిజం+మాంకోజెబ్ చల్లడం లేదా కార్బెండిజం 1గ్రాము లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని పేర్కొన్నారు.
పొట్ట కుళ్లు తెగులు..
ఇది పూతదశకు చేరిన పంటల్లో ఆశించే అవకాశం ఉందని.. ఉష్ణోగ్రతలు 20–28 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు దీని ఉధృతి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ తెగులు ఆశించినప్పుడు పొట్ట పైన నల్లని మచ్చలు ఏర్పడడం, పొట్ట కుళ్లిపోవడం, తాలు గింజలు ఏర్పడటం గమనించవచ్చు తెలిపారు. దీని నివారణకు కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి లేదా ప్రతి ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని పేర్కొన్నారు. వారి వెంట గరిడేపల్లి ఏఓ ప్రీతం కుమర్, హుజూర్నగర్ ఏఈఓ రమ్య, రైతులు ఉన్నారు.


