పంచాయతీలకు నిధులు
భువనగిరిటౌన్ : రెండేళ్ల నుంచి ఖాళీగా దర్శనమిచ్చిన పంచాయతీల ఖజానాలు ఒక్కసారిగా కళకళలాడుతున్నాయి. 2024 ఫిబ్రవరి 2వ తేదీతో పంచాయతీల పాలకవర్గాల గడువు ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీలకు పాలకులు లేకపోవడంతో ఇటు రాష్ట్ర, అటు కేంద్ర ప్రభుత్వాల నిధులు పూర్తిగా నిలిచిపోయి అభివృద్ధి కుంటుపడింది. పంచాయతీల సాధారణ ఖర్చులు, కార్మికుల వేతనాలకు కూడా ఇబ్బందులు ఎదురుకావడంతో కార్యదర్శులు అప్పులు చేసి మరీ గట్టెక్కిస్తూ వస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగి గత డిసెంబర్ 22న పాలకవర్గాలు కొలువుదీరాయి. దీంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయడంతో జిల్లాలోని 427 గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ అయ్యాయి.
నిధుల విడుదల ఇలా..
2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.7.59 కోట్లు విడుదల చేసింది. జనాభా ప్రతిపాదికన ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.48 వేల నుంచి రూ.9.8 లక్షల వరకు జమ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
మార్చి 31లోగా
వినియోగించుకునేందుకు అవకాశం
60 శాతం నిధులు పారిశుద్ధ్య పనులు, తాగునీటి అవసరాలకు వెచ్చించుకునే వెసులుబాటు ఉంది. మిగిలిన నిధులను గత అభివృద్ధి పనులకు సంబంధించి ఎంబీ రికార్డులు, ఇతర బిల్లులు సక్రమంగా ఉన్న వాటికి కూడా వినియోగించేలా అవకాశం కల్పించారు. ఖర్చులు పోనూ ఇంకా మిగిలితే కొత్త పనులు చేపట్టేందుకు కూడా ఉపయోగించవచ్చు. అయితే కేంద్రం విడుదల చేసిన ఈ నిధులను మార్చి 31వ తేదీలోగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు పాలకవర్గాలు ఈ నిధులను ఖర్చు చేస్తే త్వరలోనే మిగిలిన నిధులు కూడా మంజూరయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
15వ ఆర్థిక సంఘం నిధులు
విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
427 గ్రామ పంచాయతీల
ఖాతాల్లో రూ.7.59 కోట్లు జమ
60 శాతం నిధులు పారిశుద్ధ్యం,
తాగునీటి అవసరాలకు
వినియోగించుకునే వెసులుబాటు


