మహిళా సంఘాలకు సొంత భవనాలు
అడ్డగూడూరు: మహిళా స్వయం సహాయక సంఘాలకు సొంత భవనాలు లేకపోవడంతో ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, చెట్ల కింద సమావేశాలు నిర్వహించుకునేవారు. ఈ ఇబ్బందులను తొలగించేందుకు గ్రామాల్లో మహిళా సంఘాల కోసం ప్రత్యేక భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వీబీ జీ రామ్జీ (జాతీయ ఉపధి హామీ పథకం) నిధులతో ఒక్కో భవన నిర్మాణానికి రూ.10లక్షలు కేటాయించింది.
రూ.10 లక్షలతో భవన నిర్మాణం
వీబీ జీ రామజీ పథకం కింద ఒక్కో గ్రామ సమాఖ్య సంఘానికి 200 గజాల స్థలంలో రూ.10 లక్షలతో భవనాలు నిర్మించనున్నారు. ఐకేపీ ఏపీఎంలు, పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు ఆయా గ్రామాల్లో స్థల పరిశీలన చేయనున్నారు. తీర్మాణాలు చేసి డీఆర్డీఓ ద్వారా కలెక్టర్కు నివేదిక పంపించనున్నారు. మంజూరైన భవన నిర్మాణాలను పలు గ్రామాల్లో ఇప్పటికే ప్రారంభించారు. ఈ భవనాల్లో రైతు వేదికల మాదిరిగానే కుర్చీలు, బల్లలు, ప్రొజెక్టర్, ఇంటర్న్ట్ సదుపాయం, వీడియో కాన్ఫరెన్స్ టీవీ, ఫ్యాన్లు వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. ఇప్పటికే గ్రామ సమాఖ్య సంఘాల భవనాల కోసం ప్రతిపాదనలకు తీర్మానాలు చేయగా, అందులో 186 భవనాలకు ఇప్పటికే అనుమతులు లభించాయి. మిగిలిన చోట్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మిగిలిన ప్రతిపాదనలపై త్వరలోనే అనుమతులు రానున్నట్లు సమాచారం.
186 భవనాలకు అనుమతులు
200 గజాల స్థలంలో
రూ.10 లక్షలతో భవన నిర్మాణం
భవనం మంజూరు చేయడం సంతోషంగా ఉంది
మాకు ఇప్పటివరకు సమావేశాలు నిర్వహించుకోవడానికి సొంత భవనం లేక ఇబ్బందులు పడ్డాం. ఇళ్లలో సమావేశాలు పెట్టాల్సి వచ్చేది. శిక్షణ సమయంలో కూర్చోవడానికి కూడా సదుపాయాలు ఉండేవి కావు. మహిళా సంఘాలకు సొంత భవనాలు మంజూరు చేయడం సంతోషంగా ఉంది.
– పసునూరి లక్ష్మి, అడ్డగూడూరు


