మహిళలకు అండగా పోష్
ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చు
అడ్డగూడూరు : చదువుతున్న బడి, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్, పనిచేసే పరిశ్రమ.. ఇలా ఎక్కడో ఒకచోట మహిళలు, బాలికలు వేధింపులు ఎదుర్కొంటున్నారు. వీటినుంచి రక్షణ కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం పోష్ (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్) చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కార్యాలయాల్లో మహిళలు సురక్షితంగా గౌరవంగా పనిచేయడానికి అనుకూల వాతావరణం కల్పించడమే ఈ చట్టం లక్ష్యం. మహిళలపై జరిగే లైంగిక వేధింపులను నివారించడం, ఫిర్యాదులను స్వీకరించడం, విచారణ చేయడం, న్యాయం చేయడం దీని ముఖ్య ఉద్దేశం.
అంతర్గత ఫిర్యాదుల కమిటీ..
పది మందికి మించి ఉండే పరిశ్రమ, సంస్థ, కార్యాలయాలకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ అవసరం. ఫిర్యాదుల కమిటీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ మహిళా శిశు సంక్షేమ శాఖ.. జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా సంక్షేమ శాఖ కమిటీల ఏర్పాటుకు సిద్ధమైంది. దీనిపై ఇటీవల జిల్లాస్థాయిలో సన్నాహక సమావేశం నిర్వహించారు. మహిళా సాధికారిత కేంద్ర కమిటీల ఏర్పాటుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో 129 కమిటీలను ఏర్పాటు చేశారు.
నమోదు ఇలా..
కంపెనీ లేదా కార్యాలయం పేరు, నిర్వాహకుడు, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, చిరునామా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వివరాలలోపాటు సంస్థ ప్రతినిఽధి ఒకరిని నోడల్ అధికారిగా పోష్ పోర్టల్లో నమోదు చేయాలి. జిల్లా స్థాయిలో జిల్లా మహిళా సాధికారిత విభాగం సదరు రిజిస్ట్రేషన్ను పరిశీలించి ఆమోదిస్తుంది. అనంతరం మరోసారి పోర్టల్లోకి వెళ్లి కమిటీ సభ్యుల వివరాలు నమోదు చేయాలి. కనీసం ముగ్గురు సిబ్బంది, ఒకరు చొప్పున ఎన్జీఓ ప్రతినిధి, న్యాయవాదిని సభ్యులుగా ప్రతిపాదించాలి. కమిటీకి ఒకరు ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. జిల్లాస్థాయి కమిటీకి కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారితో సహా ఇతర జిల్లా అధికారులు, న్యాయవాది, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు.
కమిటీ విధానాలు ఇలా..
● ప్రతి సంస్థలో అంతర్గత ఫిర్యాదు
కమిటీ ఉండాలి
● వేధింపులు ఎదుర్కొంటే బాధిత మహిళ సంఘటన జరిగిన తేదీ నుంచి 3 నెలల్లోపు
ఫిర్యాదు చేయాలి
● ఫిర్యాదు అందిన 90 రోజుల్లోగా కమిటీ విచారణ పూర్తి చేయాలి
● ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఫిర్యాదుల కమిటీ సభ్యులు విచారిస్తారు
● నేరం రుజువైతే సస్పెండ్ లేదా బదిలీ చేయవచ్చు
● బాధితులు సంతృప్తి చెందకపోతే జిల్లాస్థాయి అధికారి దృష్టికి తీసుకెళ్లవచ్చు
● పోర్టల్లో సైతం ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుంది.
● వేధింపులకు గురైన మహిళ హెల్ప్లైన్ టోల్ ఫ్రీ నంబర్ 040–27542017కు సమాచారం ఇవ్వవచ్చు
● అవసరమైతే బాధితురాలికి రక్షణ చర్యలు
తీసుకోవాలి.
ఇప్పటివరకు ఏర్పాటు
చేసిన కమిటీలు
ప్రభుత్వ కార్యాలయాల్లో 35
ప్రభుత్వ సంస్థల్లో 63
ప్రైవేట్ సంస్థల్లో 31
మహిళ భద్రతే లక్ష్యంగా పోష్ చట్టం పనిచేస్తుంది. ప్రైవేటు సంఽస్థల్లో అన్నిచోట్ల అంతర్గత కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. వేధింపులకు గురైతే కమిటీలకు ఫిర్యాదు చేసి న్యాయం పొందవచ్చు. మహిళలు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
–నరసింహారావు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి
ఫ వేధింపుల నుంచి రక్షణకు పనిచేసే చోట అంతర్గత ఫిర్యాదుల కమిటీలు
ఫ మహిళా శిశు సంక్షేమ శాఖ కసరత్తు
ఫ ఇప్పటివరకు జిల్లాలో 129 కమిటీల ఏర్పాటు


