కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలి
సాక్షి,యాదాద్రి : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూర్ మున్సిపాలిటీలకు సంబంధించి భువనగిరి మండలంలోని దివ్యబాల విద్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్స్ను అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్స్, సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లు, టేబుళ్ల అమరిక, సిబ్బంది నియామకాలు వంటి అంశాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించాలన్నారు. ప్రతి టేబుల్ వద్ద అంజర్వర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అభ్యర్థులు, ఏజెంట్లకు తాగునీరు, ప్రాథమిక వైద్య సదుపాయాలు కల్పించాలని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడు అంచల భద్రత కల్పించాలని, అనుమతి ఉన్నవారికి మాత్రమే ప్రవేశం ఇవ్వాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా నిషేధించబడినట్లు స్పష్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేసి ఫలితాలను సమయానికి ప్రకటించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.


