జంగారెడ్డిగూడెం (చింతలపూడి): గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి దేవస్థానంలో స్వామివారికి శనివారం వేదపండితులు, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో పంచామృత అభిషేకం వైభవంగా నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో జరిగిన ఈకార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ.1,81,250 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో సుమారు 2,025 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, సహాయ కమిషనర్, ఈఓ ఆర్వీ చందన తెలిపారు.
ఆగిరిపల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆగిరిపల్లిలోని శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పవిత్రోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, స్నపన, ప్రత్యేక అలంకరణ, సాయంత్రం విష్వక్సేన పూజ, పవిత్రోత్సవాలు అంకురార్పణ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, ముత్తేవి గోపాలకృష్ణమాచార్యులు, అనంత కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి సాయి పర్యవేక్షించారు.
పారిజాతగిరిలో విశేష పూజలు
జంగారెడ్డిగూడెం (చింతలపూడి): స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. భక్తులు గిరిప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ వెనుక ప్రాంగణంలో నూతనంగా అభివృద్ధి చేసిన 2 ఎకరాల కార్ పార్కింగ్ ప్రదేశాన్ని పునఃప్రారంభించారు. పూజా టిక్కెట్లు, కానుకలు, విరాళాల ద్వారా ఆలయానికి రూ.1,11,900 ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఈఓ మాణికల రాంబాబు తెలిపారు.
యలమంచిలి : కాజ గ్రామ పరిధిలోని 214వ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలకొల్లు మండలం దిగమర్రు గ్రామానికి చెందిన పడాల రాంబాబు (50) మృతి చెందినట్లు ఎస్సై మోటూరి రాజ్కుమార్ తెలిపారు. వివరాల ప్రకారం కొబ్బరి ఒలుపు కార్మికులుగా జీవనం సాగిస్తున్న పడాల రాంబాబు, కాటిక సురేష్ శనివారం కొబ్బరి ఒలుపునకు అంబేడ్కర్ కొనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరం గ్రామం వెళుతుండగా బైక్లో పెట్రోల్ అయిపోయింది. దీంతో సురేష్ బైక్ను నడిపించుకుంటూ వెళ్తుండగా, వెనుక పడాల రాంబాబు నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెనుక నుంచి బైక్ వచ్చి రాంబాబును బలంగా ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఢీ కొట్టిన బైక్ను నడుపుతున్న యువకుడికి తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అతని వివరాలు తెలియలేదు. అతడిని చికిత్స నిమిత్తం భీమవరంలోని ఒక పైవేట్ ఆసుపత్రికి తరలించారు. రాంబాబు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాంబాబుకు భార్య శ్రీ శ్యామల, కుమారుడు హేమంతరావు, కుమార్తె మహాలక్ష్మి ఉన్నారు. హేమంతరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజ్కుమార్ తెలిపారు.
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో ప్రశాంతి అనే మూడేళ్ల చిన్నారి తప్పిపోయినట్లు గుర్తించామని సీ్త్ర, శిశు సంక్షేమ అధికారిణి పి.విజయలక్ష్మి తెలిపారు. పాప తన పేరు ప్రశాంతి అని, తండ్రి పేరు కిశోర్, తల్లి పేరు దేవి అని, తనకు ఒక తమ్ముడు ఉన్నాడని చెబుతోందని పేర్కొన్నారు. ఊరు, ఇతర వివరాలు మాత్రం తెలియరాలేదన్నారు. ప్రస్తుతం బాలికను సంరక్షణా కేంద్రానికి తరలించినట్లు ఆమె తెలిపారు. ఈ పాపకు సంబంధించిన వివరాలు తెలిసిన వారు 89191 58821, 89191 59644 నంబర్లను సంప్రదించాలని కోరారు.
భీమవరం (ప్రకాశంచౌక్): కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో శనివారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ నాగరాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.


