బుట్టాయగూడెం: పొగాకు బోర్డులో రిజిస్టర్ అయిన రైతులు మాత్రమే పొగాకు పంట సాగు చేయాలని జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం–1 సూపరింటెండెంట్ వై.ప్రశాంత్ తెలిపారు. మండలంలోని దొరమామిడిలో ఈ ఏడాది పొగాకు పంట నియంత్రణపై రైతులకు శనివారం అవగాహన కార్యక్రమాన్ని బోర్డు అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రిజిస్టర్ చేయని రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ పంట సాగు చేయవద్దని చెప్పారు. అలాగే 2026–27 పంట కాలానికి గాను ఉత్తరప్రాంత తేలికపాటి నేలల్లో ఎన్ఎల్ఎస్ పొగాకు పంటను ఒక్కో బేరన్కు 2 వేల కేజీల వరకు మాత్రమే సాగు చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు పరిమితికి మించి పంట సాగు చేయవద్దని సూచించారు. అలాగే సొంత భూములు, సొంత బేరన్ లైసెన్స్ ఉన్న రైతులు మాత్రమే పొగాకు సాగు చేయడం శ్రేయస్కరమని, కౌలు భూముల్లో పొగాకు సాగు లాభదాయకం కాదని చెప్పారు. పొగాకు పంటతోపాటు ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి పెట్టాలన్నారు. వేరుశనగ, మొక్కజొన్న, కంది, మిరప, శనగ వంటి పంటలు పండించడం ద్వారా ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మార్కెట్లో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పోలిన సుబ్రహ్మణ్యం, కాకర్ల శివ రామకృష్ణ, మద్దిపాటి వెంకట సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


